Thursday, April 16, 2026
spot_img
Home Blog Page 6

కరీంనగర్లో బండి వర్సెస్ పొన్నం.. చివరి నిమిషంలో కాంగ్రెస్ కు ట్విస్ట్ ఇచ్చిన బీఆర్ఎస్.. బల్దియాపై రెపరెపలాడిన కాషాయం

కరీంనగర్ కార్పొరేషన్ పీఠం.. క్షణక్షణం ఉత్కంఠ రేపింది. భక్తులకే కాదు రాజకీయ పార్టీలకూ శివరాత్రి రోజున జాగరణ తప్పలేదు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత బీజేపీ అత్యధిక స్థానాలతో మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు సన్నద్ధమైంది. ఈ తరుణంలో తామూ బరిలో ఉన్నామంటూ మంత్రి పొన్నం ఒక్కసారిగా బాంబు పేల్చారు. అప్రమత్తమైన కమలం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అత్యధిక స్థానాల్లో గెలిచిన కాషాయం జెండా బల్దియాపై రెపరెపలాడాల్సిందే అని పట్టుబట్టిన బండి సంజయ్ తన మార్కు చూపారు. రాజకీయ చతురత ప్రదర్శించారు. ఒక దశలో సీఎం కరీంనగర్ పై ఫోకస్ పెంచడంతో అందరి దృష్టి పడింది. రాష్ట్రమంతా ఈ కార్పొరేషన్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ మంత్రులు ఒక్కరోజులోనే ఈక్వేషన్ మార్చిపడేశారు. స్వతంత్రులు, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్ బి సహకారంతో హస్తగతం చేసుకునేందుకు పొలి’టిక్స్’ ప్రదర్శించారు. ఒక దశలో స్వతంత్ర అభ్యర్థిని మేయర్ గా ప్రకటించారు. ఏమైందో ఏమో గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయంపై మళ్లీ వెనక్కి తగ్గి.. కాంగ్రెస్ అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. అర్ధరాత్రి తర్వాత పేరు ప్రకటించనున్నట్లుగా లీకులిచ్చారు. ఈ ఎపిసోడ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన గులాబీ బాస్ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మేయర్ ఎన్నికకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నేతలను ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం తాము ఎవరికీ మద్దతు ఇవ్వమని కారు పార్టీ స్పష్టం చేసింది. ఈ హఠాత్ పరిణామంతో కాంగ్రెస్ కంగుతుంది. బంతి బీజేపీ చేతిలోకి వెళ్లడంతో కమలం పార్టీకే పీఠం ఖాయమైంది. ఎన్నిక ప్రక్రియ లాంచనమైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మేయర్ స్థానం దక్కించుకొని బీజేపీ రికార్డు సృష్టించింది.

భారీ అంచనాలతో..’పెద్ది’గా వస్తున్న చరణ్

0

కొణిదెల రామ్ చరణ్ తేజ్.. సినీ జగత్తులో తన కంటూ ఓ పేజీని లిఖించుకున్న నటుడు. తండ్రి వారసత్వంగా ‘చిరు’తగా ఎంట్రీ ఇచ్చినా అనతికాలంలోనే అభిమానుల మది దోచుకున్న మగధీరుడు. ఓ‘రేంజ్‌’లో రచ్చతో ఇరగదీసి అందరికి నచ్చే నాయక్ అయ్యాడు. హిట్లలో తుఫాన్‌గా మారి .. ఎవడికి అందనంత ఎత్తుకు చేరాడు. క్రమశిక్షణలో అందరికీ నచ్చీ మెచ్చే గోవిందుడయ్యాడు. బ్రూస్‌లీ ఫైట్లతో ధ్రువతారగా నిలిచాడు. రంగస్థలంపై తన నటనతో వినయ విధేయుడిగా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలందుకున్నాడు. సినీ ప్రపంచంలో ట్రిపుల్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆచార్యుడిగా అందరి మన్ననలు పొంది గేమ్‌చేంజర్‌గా నిలిచి ‘పెద్ది’గా రాబోతున్నాడు.
సినీ ప్రస్థానం..
రెండు పదులు దాటగానే తెలుగు ఇండస్ట్రీలోకి చిరుతగా అడుగీడిన చరణ్.. పూరి దర్శకత్వంలో ‘అన్నయ్య’ అభిమానులకు హీరోగా సూపరిచితమయ్యాడు. 2007లో విడుదలైన ఈ చిత్రం అంచనాలు మించి సూపర్ హిట్ నమోదు చేసుకుంది. చెర్రీని ఆ ఏడాది ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు వరించాయి. తర్వాత వచ్చిన మూవీ రాజమౌళి దర్శకత్వం లోని మగధీర. ఇది సంచలన విజయంతో టాలీవుడ్ ను షేక్ చేసింది. ఆ ఏడాది చరణ్ ఖాతాలోకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ , నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులు చేరాయి. 2010లో భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆరెంజ్ కు నెగటివ్ టాక్ వచ్చినా చరణ్ యాక్షన్ కు మాత్రం విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక 2011లో సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన రచ్చ పూర్తిగా అభిమానుల హృదయాల్లోకి చొచ్చుకెళ్లి భారీ ఓపెనింగ్లను సాధించింది. సక్సెస్ కిక్ ఇండస్ట్రీలో దుమ్ము లేపింది. 2013లో వీవీ దర్శకత్వంలో వచ్చిన నాయక్ కూడా హిట్ జాబితాలోకే చేరింది. అదే ఏడాది అపూర్వ లాఖియా దర్శకత్వంలో వచ్చిన తుఫాన్ పరవా లేదనిపించింది. 2014లో వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎవడు సైతం సక్సెస్ బాటలొనే నడిచింది.2014లో కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన గోవిందుడు అందరివాడిగా నిలిచింది. 2015 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్రూస్ లీ పరవాలేదనిపించినా… 2016 లో వచ్చిన ధృవ సక్సెస్ కొట్టింది. 2018 లో వచ్చిన రంగస్థలం లో రాంచరణ్ తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ చిత్రం సక్సెస్ కే పరిమితం కాకుండా సెన్సేషనల్ నమోదు చేసింది. 2019 బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కిన వినయ విధేయ రామ కాస్త నిరాశ పరిచింది. ఇక 2022లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ రికార్డులనే తిరగరాసింది. తొలి రోజె ప్రపంచ వ్యాప్తంగా రూ. 235 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచనాలకు వేదికగా నిలిచింది. అదే ఏడాది వచ్చిన ఆచార్య డిజాస్టర్ జాబితాలోకి చేరింది. గత ఏడాది గేమ్ ఛేంజర్ కు పాజిటివ్ టాక్ దక్కింది. తాజాగా పెద్ది సినిమా అంచనాలతో రూపుదిద్దుకుంటుంది

చిత్ర విశేషాలు
ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానంది.
బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
రామ్ చరణ్ తేజ్ బయోగ్రఫీ..
పుట్టినరోజు : మార్చి 27, 1985
తల్లిదండ్రులు : సురేఖ-చిరంజీవి
సొదరీమణులు: శ్రీజ, సుష్మిత.
వివాహం : జూన్ 14, 2012న ఉపాసన
పిల్లలు: క్లిమ్కారా, శివరాం అన్విరాదేవి
హాబీస్: హార్స్ రైడింగ్
నచ్చిన నటుడు : సూర్య
పేవరేట్ నటి : సమంత

‘పుర’పోరులో దూసుకెళ్లిన హస్తం.. సైడ్ ఇచ్చిన ‘కారు’ .. ఉత్తరాన వికసించిన కమలం

మున్సిపల్‌ పోరులో రాష్ట్రంలో కాంగ్రెస్‌ హవా కనిపించింది. మూడు కార్పొరేషన్లతో పాటు 85 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆదిక్యత ప్రదర్శించింది. మరికొన్నిచోట్ల మిత్రపక్షాలు, స్వతంత్రుల సహకారంతో మరిన్ని చేజెక్కించుకునే దిశగా అడుగులు వేస్తుంది. రికార్డు స్థాయి బల్దియాలను కైవసం చేసుకున్న క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది. ఇక గత ఎన్నికల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన బీఆర్‌ఎస్‌ తాజాగా రెండో స్థానంలో నిలిచింది. కేవలం 13 మునిసిపాలిటీలతోనే సరి పెట్టుకోవాలసి వచ్చింది. పట్టణ పార్టీగా పేరుగాంచిన బిజెపి ఈసారి ఉత్తర తెలంగాణలో సత్తా చాటింది. కరీంనగర్ తోపాటు నిజామాబాద్ కార్పొరేషన్లలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది. ఈ రెండు చోట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్ అన్నీ తామై ముందుకు నడిపారు. అలాగే ఆదిలాబాద్, ఖానాపూర్ లో కూడా కమలం పాగా వేసేందుకు సిద్ధమైంది. గతంతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం కూడా పెంచుకొని పట్టణ పార్టీగా మరోసారి నిరూపించుకుంది.

కన్నారంలో వికసించిన కమలం.. సత్తా చూపిన ‘బండి’

మున్సిపల్‌ పోరులో భాగంగా ఉద్యమాల పురిటిగడ్డపై కషాయ జెండా ఎగిరింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ‘కమలం’ వికసించింది. ఈ ఎన్నికలను స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి అయిన బండి సంజయ్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్నీ తానై ముందుండి నడిపారు. మొత్తం 66 స్థానాలకు గాను బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. గత పాలకవర్గాన్ని కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌ ఈ సారి మూడో స్థానానికి పడిపోయింది. కేవలం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. 9 స్థానాలే దక్కాయి. అలాగే ఎంఐఎం రెండు, ఏఐఎఫ్‌బీ ఒకటి, ఇతరులు 10 స్థానాల్లో నిలిచారు

అమ్మా.. బంగారం ధర మళ్లా పెరుగుతందట.. తీసుకోపొయిన్రే!

0

ట్రింగ్‌ ట్రింగ్‌.. హలో అమ్మ. ఏం చేస్తన్నవే.. అన్నం తిన్నవా.. బాపేంజేస్తండు.. తమ్ముడు షాప్‌కు పోయిండా.. అని అపర్ణ అనంగనే అంత మంచే బిడ్డా.. మీరెట్లున్నరు.. పిల్లలు స్కూ్ల్‌కు పోయిన్రా.. అంటూ బిడ్డను కుషల సమాచారం అడిగింది తల్లి సావిత్రి. అమ్మా మొన్న పండక్కి వచ్చినప్పుడు బంగారం కొందమని అంటివి కదే.. ఏమైంది తీసుకున్నవా.. యే.. ఏం కొనేటట్టు ఉంది బిడ్డా.. తులం రెండు లక్షలంటున్నరు.. మొన్నటి దాకా లక్ష కూడా లేకుండే.. మూడు, నాలుగు నెలల్నే డబుల్‌ అయిందట.. తగ్గుతదంటండ్రు.. అందుకే ఆగినం. బిడ్డా నీ పెండ్లప్పుడైతే పది వేలకు తులముండే. లక్షకు పది తులాలు తీసుకున్నమ్‌. అదే ఇప్పుడు తులం కూడా రావట్లేదు. అవునమ్మా.. అందరూ గోల్డ్‌పైనే పెట్టుబడి పెడుతున్రట. అందుకే ఇట్లా పెరుగుతున్నయటున్రు. మొన్న బడ్జెట్‌ కానుంచి కొంచెం దిగచ్చినయ్‌.. లక్షన్నర దాకా వచ్చింది. రెండు, మూడు రోజుల నుంచి మళ్లా పెరుగుతంది. ఈ ముచ్చట చెప్పుదామనే ఫోన్‌ చేసిన. ముందు పెండ్లిళ్ల సీజన్‌.. బాగా పెరుగుతదంటుడ్రు. బాపు కూడా మొన్న బ్యాంకుల పైసలు ఉన్నయ్‌ అనే కదా.. తక్కువున్నప్పుడు ఓ మూడు తులాలు తీసుకోపోయిన్రే అని బిడ్డ అనుడితోనే గా పైసలా బిడ్డా.. మొన్న బయట ఉంటే ఖర్చయితనయ్‌ అని ఫిక్స్‌ చేసిండు బాపు. అవునా బ్యాంకుల మిత్తి తక్కువ కదే.. అదే బంగారం చూడు ఏడాది తిరగకుండా డబుల్‌ అయే. మీ అల్లుడు మొన్న చిట్టి పైసలు వస్తే తులం తీసుకున్నడు.. వారం రోజులకే పదిహేను వేలు పెరిగింది. తమ్ముని పెండ్లి వరకు మళ్లా రెండు లక్షలు దాటేటట్టు ఉంది. పిరమైనంక కొనబుద్ధి కాదు. అప్పుడే కొంటే మంచిగుండు అనిపిస్తది. ఇప్పుడు మూడు తులాలు వచ్చేది అప్పుడు రెండు కూడా రాదు. లేట్‌ చేయకుండా కొంటెనే బెటరనిపిస్తంది నాకు. సాయంత్రం బాపుకు చెప్పుతా ఆగు అని బై అంటూ ఫోన్‌ కట్‌ చేసింది అపర్ణ. బిడ్డ చెప్పింది నిజమే అనిపిస్తుంది అంటూ ఆలోచనలో పడింది సావిత్రి.
పాతికేళ్లలో బంగారం ధరలు
సంవత్సరం ధర (10 గ్రాములు)
2000 రూ.4,400
2005 రూ.7,000
2010 రూ.18,000
2015 రూ.26,000
2020 రూ.48,000
2024 రూ.75,000
2025 రూ.1,02,000
2026(జనవరి29) రూ.1,83,000
ఫిబ్రవరి 10 రూ.1,57,000
================