Thursday, April 16, 2026
spot_img
Home Blog Page 5

గ్యాస్ రాదాయే.. కట్టలు పిరమాయే

0

ఓ మామ.. నమస్తే. ఎటో గవర గవరగా పోతున్నవ్ ఏంది అని రాకేష్ అనంగనే.. ఏం లేదు అల్లుడు.. ఇంట్ల గ్యాస్ అయిపోతంది.. బుక్ చేస్తే అయితలేదు.. బయట దొరక లేదంటుండ్రు కదా.. అందుకే ఏజెన్సీ దిక్కు పోతన్న అని పల్సర్ బండి రేస్ చేసిండు రాములు. ఓ మామ ఒక్క నిమిషం ఆగు. నీకు ఈ ముచ్చట తెల్వదా.. గ్యాస్ బుకింగ్ ఇప్పుడు టౌన్ల 25 రోజులకు, పల్లెల 45 రోజులకు పెంచిండ్రు. నువ్వు అక్కడికి పోయినా లాభం లేదు. నిన్ననే మన సాయి గాడు పోయి పొద్దంత నిలబడి ఉత్త చేతులతోనే వచ్చిండు. డీలరు టైం అయినంక బుక్ చేసుకుంటే ఇంటికే వస్తది పో.. అన్నడట..! తమాం లేదని కట్టెల కోసం ఇప్పుడే వాడు బాయికడికి బండి కట్టిండు. అవ్..అల్లుడు నేను కూడా పోవుడు దండగే అంటావా.. సిలిండర్ వచ్చి నెల కాలేదు మరి.. ఏమన్న బ్లాక్ లో దొరుకుతదా.. వంద, రెండు వందలు ఎక్కువైనా మంచిదే.. తెలిసినోళ్లు ఎవలన్న ఉన్నరా.. చెప్పు అని అనంగనే.. ఓ మామ బయట కూడా అంతా స్ట్రిక్టే ఉన్నది. ఎక్కడన్నా ఉన్నా డబుల్ రేట్ అంటుండ్రు.. దానికన్నా నువ్వు కూడా ఇన్ని కట్టెలు తెచ్చుకో పోరాదే అనే మాట పూర్తిగాక ముందే.. మా బాయి కాడ ఒక్క పుల్ల లేదు.. గా ఈరసామి దగ్గర అడుగుతా.. అని తలకాయ పైకి ఊపిన రాములు చూస్తూ .. ఓ మామా మొన్నటి దాకా వంద రూపాయలకు అమ్మిన మూట ఇప్పుడు వాడు రూ.రెండు వందలు అంటుండట.. అట్లయితే ఇగ గుట్టకు పోవాల్సిందే అంటూ బండిని ఇంటి వైపు తిప్పాడు రాములు.
(గ్యాస్ ఇక్కట్లు మొదలైన నేపథ్యంలో పల్లె ముచ్చట..)

‘బండి’కి మళ్లీ రాష్ట్ర పగ్గాలు వస్తున్నాయా.. ‘అంజన్న’.. ఆశీర్వాదంతో ‘కమలం’ వికసిస్తుందా!

రాష్ట్రంలో బీజీపీకి మంచి రోజులు వస్తున్నాయా అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో పుంజుకుంటున్నట్లుగా ఇటీవల జరిగిన పుర పోరులో స్పష్టమైనది. గతంతో పోల్చితే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు నారాయణపేట మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆదిలాబాద్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న విషయం విధితమే. బైంసా బల్దియనూ ఎంఐఎంకు దక్కకుండా స్వతంత్రులకు మద్దతుగా నిలిచి ఆదిపత్యం ప్రదర్శించింది. మరికొన్ని చోట్ల వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధానంగా పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర తెలంగాణలో కొంతమేర పట్టు సాధించినట్లు తెలుస్తుంది.
అందరి చూపు ‘బండి’ పైనే
2019 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఎన్నికయ్యారు. అయితే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని లక్ష్యంతో అధిష్టానం ఆయన కు 2020 మార్చి 11న రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను తన మాటల తూటాలతో ఎక్కుపెట్టి పార్టీని అన్నీ తానై ముందుకు నడిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టి కార్యకర్తల్లో జోష్ పెంచారు. ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ మారిపోయాయి. తదుపరి ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటడం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు సైతం పేర్కొన్నారు. ఏమైందో ఏమో కానీ సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు అధిష్టానం సంజయ్ ను తప్పించింది. 2023 జులై 4 వరకు అంటే దాదాపు మూడున్నర ఏళ్ల పాటు కొనసాగారు. తదనంతరం కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ జోష్ ను మాత్రం కొనసాగించలేక పోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బండికి జులై 29న పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మళ్లీ ఘన విజయం సాధించారు. జూన్ 9న  కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నీ తానై..
ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బండి పూర్తిస్థాయిలో ఫోకస్ పెంచారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని బల్దియాపై కాషాయ జెండా రెపరెపలాడించారు. ఒక్కసారిగా కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఈ క్రమంలోనే అంజన్న ఆశీర్వాద యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇటీవల గెలిచిన వారితో పాటు శ్రేణులతో కలిసి శనివారం పాదయాత్ర బాట పట్టారు.
మహాశక్తిని దర్శించుకుని అంజన్న బాట పట్టి
కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుంచి బయలుదేరి సాయంత్రానికి అంజన్న సన్నిధికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామిని దర్శించుకున్నారు. పార్టీ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ పాదయాత్ర కాషాయ శ్రేణుల్లో జోష్ పెంచింది. సంజయ్ అన్నకు మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించే యోచన అధిష్టానం చేస్తున్నట్లుగా అక్కడక్కడ వినిపించింది. అదే నిజమైతే ఆ పార్టీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం లేకపోలేదు. అయితే ఆ పార్టీ పెద్దల మదిలో ఏముందో మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

ఎల్లలు దాటిన అభిమానం.. కవితకు వినూత్నంగా బర్త్ డే విషెస్

0

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జావేద్ మాలిక్ అనే కళాకారుడు బిల్డింగ్ టెర్రస్ పై గోధుమలతో బతుకమ్మ ఎత్తుకున్న కవిత భారీ పటాన్ని చిత్రించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన జాగృతి యువ నాయకులు మైలారం అరుణ్ రెడ్డి, కృష్ణారెడ్డి తమ అభిమాన అధినేత్రికి వినూత్నంగా ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పరాభవ నామ సంవత్సరం ఎవరికి కలిసొచ్చెనో?

ఈ నెల 19న ఉగాది. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆరంభం కానుంది. ఈ ఏడాది రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దామా మరి.
ధనస్సు, మీనం వారు పట్టిందల్లా బంగారమే..
* ఈ ఏడాది ధనస్సు, మీనరాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. అదృష్టం వీరు వైపు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అత్యధికంగా (14) ఉండడమే కాకుండా.. రాజ్యపూజం కూడా ఉన్నత స్థితిలో ఉండనుంది. ఇక మేష, వృశ్చిక రాశుల వారికి ఆదాయం 11 ఉండనుంది. మిధునం కన్యారాశుల వారికి 8, అలాగే వృషభం తుల, సింహరాశుల వారికి 5 ఆదాయం పర్వాలేదనిపిస్తుండగా.. మకరం, కుంభం, కర్కాటకం వారికి కేవలం రెండు ఆదాయంతో చివరి స్థానంలో ఉండనున్నారు.
* వృషభం, తులా రాశుల వారికి అత్యధికంగా 14 వ్యయం ఉండడం గమనార్హం.
* సింహం, మీన రాశి వారికి రాజ్యపూజం ఏడుగా ఉండగా.. మిధునం, మకరం వారికి కేవలం ఒకటిగా ఉండడం విశేషం.
* అవమానం విషయానికి మిధునం,కర్కాటకం, మీనం వారికి అత్యధికంగా ఏడుగా కనిపిస్తుంది.

బిగ్ అలర్ట్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు పెరిగిందండోయ్..

గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. తాజాగా 25 రోజులకు పెంచుతున్నట్లుగా వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో తాజా పరిస్థితులు, దేశంలో బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ల ఉత్పత్తిని పెంచాలని ఆయా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.

యథాతథంగా ఈపీఎఫ్‌ వడ్డీ రేటు.. 8.25 శాతంగా ఖరారు

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) కూడా 8.25 శాతం ఖరారు చేసింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. సోమవారం నిర్వహించిన కీలక సమావేశంలో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. మూడేళ్లుగా కొనసాగుతున్న వడ్డీ రేటునే ఈ సారి కూడా ఖరారు చేసింది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది. అయితే ఈ సారి పెంపు ఉంటుందని అంతా భావించారు. ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఒకింత నిరాశకు గురయ్యారు. గడిచిన మూడేళ్లుగా వడ్డీ రేట్లు పరిశీలించినట్లయితే.. 2022-23 సంవత్సరానికి గాను 8.15 శాతం ఉండగా 2023-24, 2024-25, 2025-26 సంవత్సరాలకు 8.25శాతంగా ఉండడం గమనార్హం.

ఇక పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతాయా.. యుద్ధం ప్రభావం మనపై ఎలా ఉంటుంది.

భారత్‌లో కొద్ది రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా పశ్చిమాసియాలో యుద్ద వాతావరణం మొదలవడంతో ఇక అందరి దృష్టి ఇంధన ధరలపై పడింది. ఇప్పటికే యూరప్ లో పెట్రో ధరలపై ప్రభావం పడింది. స్వల్ప వ్యవధిలోనే 50 శాతం వరకు పెరిగాయి. మరోవైపు ఇరాన్- దుబాయ్- ఒమన్ దేశాలం మధ్య గల్ హార్మూజ్ జలసంధి మూతపడింది. అంతర్జాతీయ రవాణాకు కీలకమైన ఈ జల సంధి మూసివేతతో భారత తదితర దేశాలపై ప్రభావం పడనుంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది.
నిండుకుంటున్న నిల్వలు
ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా గల్ఫ్ దేశాల ఆయిల్ నౌకలపై దాడులు ముమ్మరం చేసింది. ఇది క్రూడ్ ఆయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఓవైపు భారత్ లోనూ ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయి.ప్రత్యామ్నాయ చర్యలపై ఇండియా దృష్టి సారిస్తుంది. అయితే రవాణా భారం ఎక్కువ అవుతున్న క్రమంలో ధరలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.
భారీగా పెరగనున్నాయా..
క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా భగ్గుమంటున్నాయి. మార్చి తోపాటు ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ బ్యారెల్‌కు 10 శాతం పెరుగుదల ఉంటున్నట్లుగా తెలుస్తుంది. బ్యారెల్‌కు ఒక డాలర్‌ పెరిగినా ఏడాదికి భారత్‌పై రూ.13 వేల కోట్ల భారం పడనున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మన దగ్గర కూడా కొద్ది రోజుల్లో మళ్లీ పెట్రో ధరలకు లెక్కలు రావడం ఖాయం అంటున్నారు నిపుణులు.

ఆరు కలిసొచ్చేనా.. ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా.. కొత్త పార్టీ అదే రోజు ఆవిర్భవించేనా?

పిడికిలెత్తిన ఆ తిరుగుబావుటా.. ఉక్కు సంకల్పమై ఉరిమే సమయం ఆసన్నమైనట్లేనా.. గ్రహణం వీడిన ఆ ‘చంద్ర’ తనయ భగభగ మండే ఆ సూర్యుని సాక్షిగా ‘తెలంగాణ జాగృతి’గా ఉదయించబోతున్నారా.. కార్మికుల పండుగ రోజున పార్టీగా రాబోతున్నారా.. తన లక్కీ నంబర్ కలిసి వచ్చే ముహూర్తం ఖరారైనట్లేనా.. కవిత మదిలో ఏముందో మరి.
*******
ప్రపంచ కార్మికులు నినదించే రోజది. తెలంగాణ రాజకీయాల్లోనూ కీలకం కానుందా.. అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి తాజా పరిస్థితులు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేయగా.. ఆమె దీటుగా స్పందించిన తీరు తెలిసిందే. రాజీనామా అస్త్రంతో పిడికిలెత్తిన ఆమె సభ్యత్వంతో పాటు పదవిని సైతం వీడారు. ఆ పార్టీ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేశారు. మరో వైపు జిల్లాల బాట పట్టి ప్రజా సమస్యలపై ఫోకస్ పెంచారు. పాలకుల తీరును ఎండగడుతూ జనం గొంతుకగా మారారు. ‘కారు’ కూతలను ఓవర్టేక్ చేస్తూ ఆత్మగౌరవం దక్కని ఉద్యమకారులకు తోడుగా.. పింఛన్ బాంచన్ అంటూ ఎదురుచూస్తున్న అవ్వలకు బిడ్డగా.. తెలంగాణ వచ్చినా కొలువులు దక్కక దగాపడ్డ నిరుద్యోగ అన్నలకు చెల్లెగా.. కష్టాల సాగులో కన్నీరు కారుస్తున్న అన్నదాతకు అండగా తానున్నానంటూ వేసిన ఒక్కో అడుగు పోరు పుస్తకంలో కొత్త పేజీలుగా మారాయి.
కడిగిన ముత్యంలా జనజాగృతి లోకి
నమ్మిన కర్మ సిద్ధాంతం.. న్యాయస్థానంలో దక్కిన ఊరట.. సత్యమేవ జయతే అంటూ వెల్లివిరిసిన ఆ ఆనంద క్షణాలు ఆమెలో మరింత పట్టుదలను బిగించాయి. శుక్రవారం కోర్టు తీర్పు దేశమంతా మారుమోగింది. రాజకీయ కక్షగా పట్టిన గ్రహణం వీడినట్లయింది. కుటుంబం దూరమైనా ఎల్లలెరుగని సబ్బండ వర్గాల నుంచి వచ్చిన ఆత్మీయ అభినందనలు వెయ్యి ఏనుగుల బలనిచ్చాయి. హితులు, సన్నిహితుల నుంచి వచ్చిన ఆ స్పందన ఆనంద బాష్పమైంది. యాదృచ్ఛికమైన ఆమె జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన రోజు ఆగస్టు 27కాగా కోర్టు తీర్పు ఫిబ్రవరి 27 కావడం విశేషం.
చారిత్రాత్మక రోజు.. చరిత్ర సృష్టించ బోతున్నారా
కేసీఆర్ తో పాటు కవిత లక్కీ నెంబర్ కూడా ఆరు. పార్టీ అనౌన్స్మెంట్ కూడా అదే రోజు ఉంటుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జాగృతి అధ్యక్షురాలు మే మొదటి వారంలో కీలక ప్రకటన ఉంటుందని వెల్లడించిన నేపథ్యంలో కార్మికుల దినోత్సవం అయిన ఒకటో తారీకు ప్రాధాన్యత సంతరించుకుంది. (1+5=6) కాగా ఆరోజున శుభ ముహూర్తం కూడా ఉండడం గమనార్హం.

‘క’దిలే.. ‘వి’రాటంలో.. ‘త’పోవనమై

జై తెలంగాణ.. అని గర్జించిన ఆ ఉద్యమ గొంతుకలు పునరాలోచనలో పడ్డాయి. స్వరాష్ట్ర సాధనతో సంబురపడ్డ ఆ గుండెలకు పుష్కర కాలమైనా ఆశించిన ఆత్మగౌరవం దక్కక అల్లాడుతున్నాయి. పరాయి పాలనలో ఈసడింపులకు గురై.. అవమానాలు ఎదుర్కొన్న ఆ పోరుబిడ్డల త్యాగాలు చరిత్ర కెక్కినా.. పాలకుల మది నుంచి మాత్రం కనుమరుగయ్యాయి. ఆ తల్లుల గర్భశోకం.. ఉద్యమ సిం’దూరమై’ న వీర వనితల ఆవేదన కనురెప్ప దాటగా.. ఇనుప కంచెలను ఛేదించి కటకటాల పాలైన త్యాగాల వారసులు ఎట్టకేలకు మౌనం వీడుతున్నారు. అమరుల ఆశయాలను ప్రశ్నించి ధిక్కార స్వరంతో రక్తబంధాన్ని తెంచుకున్న ఆ పిడికిలితో అడుగులేసేందుకు సిద్ధమవుతున్నారు.

వేదిక సిద్ధం.. తప్పదు యుద్ధం

రాష్ట్రం సిద్దించిన వెంటనే నేరుగా గన్ పార్క్ వెళ్లిన జాగృతి కవిత అమరులకు నివాళులర్పించి.. కుటుంబాలను ఓదార్చిన ఆ ఘట్టం కళ్ల ముందు కదులాడుతూనే ఉంది. తాజాగా అమరుల ఆశయ సాధనకు ఆమె వేసిన ముందడుగు ఉద్యమ నేతలను ఆలోచింపజేస్తోంది. స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని ఇటీవల ఆత్మగౌరవ సభలో ఎలుగెత్తారు. రామ్ జీ గోండు.. కొమురం భీమ్.. దొడ్డి కొమురయ్య , చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడుతూ.. 1969 ఉద్యమ వీరుల పోరాటాన్ని గుర్తు చేశారు. 2001లో కేసీఆర్ సారథ్యంలో మలిదశ లో పొరుబిడ్డల బలిదానాలు మారువలేనివని పేర్కొన్నారు. అయితే స్వరాష్ట్రంలో అవకాశాలు వచ్చిన వాళ్లే ఉద్యమకారులను అవమానించే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. పరాయి పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేశాం. మన బానిసత్వాన్ని కూడా తెంచుకోవటానికి ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల అజెండాతోనే తమ పార్టీ ముందుకు పోతుందని స్పష్టం చేశారు.

డిమాండ్లు..
* ప్రతీ ఉద్యమకారుడికి నెలకు రూ. 25వేల పెన్షన్ అందించాలి.
* ఉద్యమకారులందరికీ 250 చదరపు అడుగుల ఇంటి స్థలం లేదా ఇళ్లు ఇవ్వాలి.
* రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించాలి.
* 1969, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి.
* ఉద్యమ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి, నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
* ఉద్యమ కాలంలో పెట్టిన అన్ని కేసులు వెనక్కి తీసుకోవాలి.
* ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.

రాష్ట్రంలో మరో ఎన్నికలా.. మళ్లీ పల్లె సందడేనా.. పరిషత్ పై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం

పల్లె, పట్టణ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార పార్టీ మరో ఎన్నికలకు సిద్ధమవుతుందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా పరిషత్ పై కాంగ్రెస్ ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. హస్తం పెద్దల ఢిల్లీ టూర్.. తాజా పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి..
క్యాబినెట్లో నిర్ణయించేనా..
ఇప్పటికే వరుస ఎన్నికలతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ పరిషత్ లోనూ సత్తా చాటాలని ఉవ్విల్లూరుతుంది. ఇదే సరైన సమయం గా భావిస్తుంది. ఇందులో పల్లె ఓటర్లే ఉంటారు కాబట్టి రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాలో వేసేందుకు సిద్ధమైంది. ఈనెల 23న నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే త్వరలోనే పదో తరగతి పరీక్షలు ఉన్న నేపథ్యంలో అవి ముగిశాక వెళ్తారా.. ముందే ముగిస్తారా అనేది అక్కడే ఖరారు కానున్నట్లుగా తెలుస్తుంది.
సీఎం మదిలో ఏముంది
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ళవుతుంది. ఓవైపు ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన జూబ్లీహిల్స్ తో పాటు గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో దూసుకెళ్లిన ‘హస్తం’ పార్టీ అదే ఊపు కొనసాగించాలని భావిస్తుంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడీపీటీసీ ల పదవి కాలం ముగిసి ఏడాది దాటింది. మరోవైపు కేంద్రం నుంచి వచ్చిన నిధులు మార్చి చివర్లోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేకుంటే తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఈ తరుణంలో పరిషత్ వైపు వెళితేనే బాగుంటుందని సీఎం మదిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.