Tuesday, July 14, 2026
Home Blog

Ippa laddu | మ‌హువా కు.. వాహ్‌వా అనాల్సిందే

ఇప్ప‌ల‌డ్డు.. ఆరోగ్యం మెండు

Ippa laddu | ఇప్ప‌ల‌డ్డు.. .నోరూరించ‌డంతో పాటు ర‌క్త హీన‌త‌కు చెక్ పెట్టే దివ్యఔష‌ధం. ప్ర‌కృతి సిద్ధంగా ల‌భించే ముడిప‌దార్థాల‌తో ఆదివాసీల చేతిలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాచీన వంట‌కం మ‌హువాకు.. జ‌నం వాహ్‌వా అంటున్నారు. కేవ‌లం రక్త‌హీన‌త‌ను అరిక‌ట్ట‌డమే కాకుండా ఎముక‌ల స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తూ రోగ‌నిరోధ‌క‌ శ‌క్తిని పెంపొందించ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంద‌ని వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు. ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అంగ‌న్‌వాడీ, ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల్లో వీటిని విద్యార్థినులు, గ‌ర్భిణుల‌కు అంద‌జేస్తున్నారు. ఇది విజ‌య‌వంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమ‌లుకు ప్ర‌భుత్వం యోచిస్తోంది. మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి మోదీ మ‌న్‌కీ బాత్‌లో ఈ ఇప్ప‌లడ్డును ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించ‌డంతో పాటు త‌యారీదారుల‌ను అభినందించిన విష‌యం తెలిసిందే.
ఆదివాసీ ఆహారంగా అందుబాటులో..
ఈ లడ్డు ఆదివాసీ ఆహారంగా ఉట్నూర్‌లో అందుబాటులో ఉంది. ఐటీడీఏ స‌హ‌కారంతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ద్వారా విక్ర‌యిస్తున్నారు. వీటిని తినడం వల్ల ర‌క్తంలో హీమోగ్లోబిన్ శాతం పెంపు, మోకాళ్ల‌నొప్పులు వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతున్న‌ట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క‌ సంస్థ‌లు సైతం ప‌రిశీలించాయి. ఐసీఎంఆర్ ఆధారంగా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియ‌న్ (NIN) ప‌రిశీలించింది. ఇందులో ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, విట‌మిన్‌సీ, కెరోటిన్‌ వంటివి అధికంగా ఉన్న‌ట్లుగా గుర్తించింది.
వీటిలో ఏమేం ఉంటాయంటే..
వీటి తయారీలో ఇప్ప పువ్వుతో పాటు కాజు, బాదం, కిస్మిస్‌, నువ్వులు, బెల్లం, ప‌ల్లీలు కలిపి తయారు చేస్తారు. ఐటీడీఏ కేంద్రంతో పాటు ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లోనూ ప్ర‌స్తుతం విక్ర‌యిస్తున్నారు.
ఎన్ ఐ ఎన్ సూచ‌న‌లు..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజనుల్లో రక్తహీనత ఏళ్లుగా వేధిస్తోంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, బాలిక‌ల్లో ఏడుశాతం లోపు ఉండ‌డంతో తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.ఈ క్ర‌మంలో వారికి ఇప్ప లడ్డూలు ఇవ్వాలని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సూచించింది. ఈక్ర‌మంలో అప్ప‌టి క‌లెక్ట‌ర్ దివ్య‌దేవ‌రాజ‌న్ ప్ర‌త్యేక చొర‌వ చూపారు. ఐటీడీఏ స‌హ‌కారంతో రూ.25 లక్షలతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘంతో ఉట్నూర్‌లో ఓ ఆహార కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. లడ్డూతోపాటు ఇప్పతో కూడిన‌ వివిధ ఆహార పదార్థాల తయారీలో ప్ర‌త్యేక శిక్షణ ఇప్పించారు. ఆదివాసీ ఆహారం పేరిట విక్ర‌యిస్తున్నారు.
ప్రయోగాత్మకంగా
ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో మూడువేల మందికి మొదటి విడతగా ఇప్ప లడ్డూలు పంపిణీ చేశారు. హిమోగ్లోబిన్‌ 7 నుంచి 8 శాతం ఉన్న వారికి రోజుకొకటి చొప్పున 45 రోజులు పంపిణీ చేశారు. అనంత‌రం నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో స‌గ‌టున హెచ్‌బీ మ‌రో 1.5శాతం పెరిగిన‌ట్లు నిర్ధారణ అయ్యింది. వైద్యులు, ఉన్న‌తాధికారుల సూచ‌న‌తో జ‌నం నుంచి కూడా ఆద‌ర‌ణ క్ర‌మంలో పెరుగుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి.. పిడుగుల కాలం.. జ‌ర జాగ్ర‌త్త సుమా!

 

kavitha arrest | కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ మొదలైంది

0
  • ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన ఆ పార్టీ బాగుప‌డదు
  • మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయాలని ఏ పోలీస్ మ్యానువల్ లో ఉంది?
  • సీఎం, మహిళా మంత్రులు, డీజీపీ సమాధానం చెప్పాలి
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
  • kavitha arrest | ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బోడుప్పల్ లో భూ పోరాటం చేసి అరెస్ట్ అయిన కవిత గురువారం సాయంత్రం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదల‌య్యారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు.
    కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు
    కాంగ్రెస్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉద్య‌మ‌కారుల‌కు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన హామీల‌ను మ‌రిచిపోయారా అని ప్ర‌శ్నించారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట అమలు చేసే ధైర్యం లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చార‌ని ప్రశ్నించారు. మీరిచ్చిన హామీలను అడిగితే పోలీసులతో కొట్టిస్తారా అంటూ మండిపడ్డారు. ఉద్యమకారుల నెత్తురు చూసిన ఈ ప్రభుత్వానికి ఇక కౌంట్ డౌన్ మొదలైందన్నారు. గతంలో ఉద్యమకారులతో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదని, ఇప్పుడు మీరు బాగుపడరని అన్నారు. ఆ పార్టీ త‌గిన‌ మూల్యం చెల్లించుకోక తప్పదని జోస్యం చెప్పారు.
    ఏ పోలీస్ మ్యానువల్ లో ఉంది?
    తనను పోలీసులు అరెస్ట్ చేసిన విధానం పై కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లాలని ఏ మ్యానువల్ లో ఉందో ముఖ్యమంత్రి, మహిళా మంత్రులు, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్తే పోలీసులకు అవార్డులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మాట, ముచ్చట, మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసిన విధానానికి సంబంధించిన‌ వీడియోలు ప్రభుత్వ పెద్దలు చూడాలన్నారు.
    ఏ పార్టీ కూడా మాట్లాడటం లేదు?
    ఉద్యమకారులను రక్తాలు వచ్చేలా కొడితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు మద్దతిస్తే వాళ్లంతా ఉద్యమకారులు కాకుండా పోతారా అని అడిగారు. ఉద్యమకారులను అన్ని పార్టీలు మోసం చేశాయని చెప్పారు. వారి తరుఫున మొదటి పోరాటం మొదలుపెట్టామని…హామీలు అమలు చేసే వరకు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    భూపోరాటం ఉద్రిక్తత
    అంతకు ముందు తెలంగాణ రక్షణ సేన పార్టీ బోడుప్పల్ లో చేపట్టిన భూ పోరాటం తీవ్ర ఉద్రిక్తతతకు దారి తీసింది. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో ఓవరాక్షన్ చేశారు. బండ రాళ్లపై పడేసి, కారు డోరుకేసి గుద్దుతూ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్ట్ లపై లాఠీచార్జి చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. కవిత ను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్భందించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్క‌డికి చేరుకున్నారు. కవిత ను వదిలిపెట్టాలంటూ ధర్నాకు దిగారు. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు భూ పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ భారీగా బోడుప్పల్ చేరుకున్నారు. భూ పోరాటం చేసిన ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్టించి, బోనం ఎత్తి ప్రత్యేక పూజాలు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి.. హమ్మయ్య.. మాకూ ఒకటో తారీకే జీతాలు

Good news | హమ్మయ్య.. మాకూ ఒకటో తారీఖునే జీతాలు

Good news | ఎట్టకేలకు వారి కష్టాలు తీరాయి. రెగ్యులర్ ఉద్యోగుల తో పాటు తమకూ ఒకటవ తారీఖునే జీతాలు అందాయి. ప్రభుత్వ నిర్ణయంతో కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ సిబ్బందిలో హర్షం వ్యక్తం అవుతుంది.
సీఎం ఆదేశాలు మేరకు..
జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని సీఎం ఇటీవ‌ల ఉన్న‌తాధికారుల స‌మీక్ష‌లో పేర్కొన్నారు. వారికి కూడా జాప్యం కాకుండా జీతాలు అందాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖలు, విభాగాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌లో జాప్యం జరగాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది. ముఖ్య‌మంత్రి ఆదేశాల‌తో రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి ఆర్థిక శాఖ ఈ నెల 1వ తేదీనే జీతాలు విడుదల చేసింది.
25 లోగా ప్రక్రియ పూర్తి..
ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్‌ బిల్లులను ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌, అకౌంట్స్‌ విభాగాలకు సమర్పించాలని ఉత్త‌ర్వుల్లో పేర్కొన‌గా.. నెల‌ చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి జీతాల చెల్లింపుల వివరాలపై ముఖ్యమంత్రి బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు జీతాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు నివేదించారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు జీతాలు అకౌంట్ల‌లో జ‌మ‌కాగా.. ఔట్‌సోర్సింగ్ కు సంబంధించి ప‌లు విభాగాల సిబ్బంది నుంచి మాత్రం త‌మ‌కు ఇంకా రాలేద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఇది కూడా చ‌ద‌వండి..:  గుడ్ న్యూస్.. వారికి కూడా రైతు భ‌రోసా

Be alert | రేపటి నుంచి మార్పులివే.. ఓ లుక్కేయండి మ‌రి

Be alert | ఈ నెల ముగిసింది. రేప‌టి నుంచి జూలై ప్రారంభం కానుంది. ప‌లు విభాగాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక, సేవా త‌దిత‌ర రంగాల్లో రాబోతున్న మార్పులు ప్ర‌జ‌ల నిత్య‌జీవితంలో ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. ఆధార్‌, ఐటీ, ఎల్‌పీజీ, పాస్‌పోర్ట్‌, రైల్వే త‌దిత‌ర రంగాల్లో రానున్న‌ అప్‌డేట్‌పై ఓ లుక్కెద్దామా మ‌రి.

  • ఎల్‌పీజీ.. : ప‌శ్చిమాసియా యుద్ధ ప్ర‌భావంతో గ్యాస్ నిబంధ‌న‌ల్లో కేంద్రం ఇటీవ‌ల ప‌లు మార్పులు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎల్పీజీ, పీఎన్జీ రెండు క‌నెక్ష‌న్లు ఉన్న వారు ఎల్పీజీ రద్దు చేసుకోవాల‌ని సూచించింది. 90 రోజుల పాటు అవ‌కాశం ఇచ్చింది. నేటితో గడువు ముగియ‌నుంది. ఈ నిబంధ‌న పాటించ‌కుంటే రేప‌టి నుంచి కొత్త ఎల్పీజీ సిలిండర్‌ బుక్ చేసుకోలేరు. అలాగే కేవైసీ పూర్తి చేయకున్నాఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. మ‌రోవైపు ఇటీవ‌ల కేంద్రం ఎల్‌పీజీ ధ‌ర‌లను భారీగా పెంచిన విష‌యం తెలిసిందే. తాజాగా యుద్ధ‌ ప్ర‌భావం త‌గ్గిన నేప‌థ్యంలో ఈ రేట్లు కూడా త‌గ్గే అవ‌కాశాలు లేక‌పోలేదు.
  • ఆధార్ అప్డేట్ : రేప‌టి నుంచి ఆధార్ అప్‌డేట్ కోసం ఉదాయ్‌( UIDAI) ప్రత్యేక సేవను తీసుకువ‌స్తుంది. ఇది వ‌రకు ఈ మెయిల్ చిరునామా న‌వీక‌ర‌ణ చేసుకోవాలంటే రూ. 75 చెల్లించాల్సి వ‌చ్చేది. ఇక నుంచి ఈ సేవ‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు.
  • పెర‌గ‌నున్న పాస్‌పోర్ట్ చార్జీలు.. : జూలై 1 నుంచి పాస్ పోర్ట్ ఫీజులు పెరగనున్నాయి. 36 పేజీల స్టాండర్డ్‌ ఫీజు ఇది వరకు రూ.1,500 ఉండేది. ఇది రూ.2,500 కు పెరిగింది. తత్కాల్ పై తాజాగా రూ. 1500 పెంచారు. దీంతో ప్ర‌స్తుత‌మున్న రూ.3,500 ఫీజు రూ.5,000కు చేరింది. 60 పేజీలు ఉన్న పాస్‌పోర్ట్ ఫీజు ఇదివ‌ర‌కు రూ.2వేలు ఉండ‌గా ప్ర‌స్తుతం రూ.3,500కు చేరింది. తత్కాల్‌ విధానంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.4వేలు చెల్లిస్తుండగా ఇకపై రూ.6వేలు చెల్లించాలి. పాస్ పోర్ట్ పోయిన లేక పాడైపోయిన కొత్త దాని కోసం ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1750 వ‌సూలు చేసేవారు. ఇక నుంచి ఈ చార్జి రూ.4,250 కానుంది.
  • మారిన రైల్వే నిబంధనలు : రైళ్లలో ప్రయాణికుల భద్రత , క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ‘జన్ విశ్వాస్ చట్టం’ కింద నిబంధనలను కఠినతరం చేసింది. జూలై 1 నుంచి వీటిని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ ప్రకారం.. రైళ్లలో, స్టేషన్ ప్రాంగణంలో స్మోక్ చేస్తూ పట్టుబడితే భారీ జరిమానా విధిస్తారు. తీవ్ర‌త బ‌ట్టి టికెట్ తక్షణ రద్దుతో పాటు, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇతరుల బెర్తులను ఆక్రమించుకున్నా, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని రైల్వే శాఖ ఇప్ప‌టికే హెచ్చ‌రించింది.
  • ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌లో.. : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2 ఫాంలు దాఖలు చేసేందుకు గాను పన్ను చెల్లింపుదారులకు జూలై 31, 2026 వ‌ర‌కు గ‌డువు ఉంది. ఈ లోపు ఐటీఆర్ దాఖలు చేయాలి. లేకుంటే జరిమానాతో పాటు కొన్ని పన్ను విధానాలపై నిషేధానికి కూడా దారితీసే అవ‌కాశం ఉంటుంది.
  •  క్రెడిట్ కార్డ్ నిబంధనలు : ఎంపిక చేసిన ఫోన్ పే, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ ల‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక నుంచి రివార్డ్ పాయింట్లపై ఎస్‌బీఐ పరిమితులు విధించింది. ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, సెలెక్ట్ బ్లాక్ వేరియంట్‌లపై ఈ ఎఫెక్ట్ చూప‌నుంది.
  • ఇది కూడా చదవండి.. గుడ్ న్యూస్ వారికి కూడా రైతు భరోసా

Rythu Bharosa | గుడ్ న్యూస్.. వారికి కూడా రైతు భ‌రోసా

 

Rythu Bharosa |  కొత్త రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూత‌నంగా ప‌ట్టాదారు పాస్ బుక్ పొందిన వారిని రైతు భ‌రోసా(Rythu Bharosa) ప‌థ‌కానికి అర్హులుగా ప్ర‌క‌టించింది. వారికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. మండ‌ల వ్య‌వ‌సాయాధికారుల‌ను సంప్ర‌దించాల‌ని వెల్ల‌డించింది.
క‌టాఫ్ డేట్ ప్ర‌క‌ట‌న‌..
ఈ నెల 15వ తేదీలోపు భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులను ఈ ప‌థ‌కానికి అర్హులుగా పేర్కొంది. వారికి జూలై 5లోగా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. మ‌రోవైపు జూన్ 30నుంచి పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్ర‌మంలో కొత్త వారికి కూడా ఈ విడ‌త‌లోనే ల‌బ్ధి చేకూర్చాల‌ని నిర్ణ‌యించింది.
దరఖాస్తు విధానం ఇలా..
ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు త‌మ ఆధార్‌, కొత్త పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌తో అనుసంధాన‌మైన బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ ప్ర‌తుల‌ను పూర్తి చేసి ద‌ర‌ఖాస్తుతో జ‌త‌చేసి మండ‌ల వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)లకు సమర్పించాలి. అధికారులు పరిశీలించి అన్ని స‌క్ర‌మంగా ఉంటే లబ్దిదారులుగా ప్ర‌క‌టిస్తారు.
ఈ ప‌థ‌కానికి అర్హులు ఎవ‌రంటే..
ద‌ర‌ఖాస్తు దారు తెలంగాణకు చెందిన రైతు అయి ఉండాలి. అలాగే కనీస వయస్సు 18ఏళ్లు త‌ప్ప‌నిస‌రి. అంతేకాదు భూమి ద‌ర‌ఖాస్తు దారుడి పేరిటే ఉండాలి. అలాగే భూమి సాగుకు యోగ్యంగా ఉండాలి. ఆర్‌వో ఎఫ్ ఆర్ పట్టాదారులు కూడా అర్హులే . అయితే బీడు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ స్థలాల‌కు మాత్రం ఈ పథకం వర్తించదు.
ఎల్లుండి నుంచే పెట్టుబ‌డి సాయం
ఈనెల‌ 30 నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ స‌ర్కారు ఇప్ప‌టికే ప్రకటించింది. తొలుత ఎకరం వ‌ర‌కు ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబ‌డి సాయం జ‌మ‌కానుంది. మిగ‌తా వారికి విడ‌త‌ల వారీగా జమ చేయాలని నిర్ణయించింది. ప‌ది రోజుల్లోనే ఈ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. మ‌రో వైపు కొత్త వారికి ఈ విడ‌త నుంచే రైతు భ‌రోసా షురూ కానుంది.

ఇది కూడా చ‌ద‌వండి.. ఇన్నారుల్లా.. పాస్‌పోర్ట్‌ ఫీజులు పెరుగుతున్న‌య్‌!

Passport | ఇన్నారుల్లా.. పాస్‌పోర్ట్‌ ఫీజులు పెరుగుతున్న‌య్‌!

Passport | అవున్న‌ల్ల మీరు విన్న‌ది నిజ‌మే. జూలై 1 నుంచి పాస్ పోర్ట్ ఫీజులు పెరుగుతున్న‌య్‌. ఈమేర‌కు కేంద్రం నిర్ణ‌యించింది. ఉత్త‌ర్వులు సైతం జారీ చేసింది. ఇక నుంచి స్టాండ‌ర్డ్ పాస్ పోర్ట్ ఫీజు రూ. 2500 ఉండ‌నుంది. తత్కాల్‌ విధానంలో అయితే రూ.5,000 చెల్లించాల్సిందే. ఈమేర‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. 14 ఏళ్ల అనంతరం పెంచుతున్నట్టుగా విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ ఫీజులు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్ల‌డించింది. నిర్వహణ, సాంకేతిక ఖర్చులు పెరగడం కార‌ణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి.

18 ఏళ్లు పైబడిన వారికి (సాధార‌ణ‌, త‌త్కాల్‌)..

  •  36 పేజీల స్టాండర్డ్‌ పాస్‌పోర్టు ఇంతవరకు రూ.1,500 ఫీజు ఉండేది. దీనిపై తాజాగా రూ. 1000 పెంచారు. ఇకపై రూ.2,500 వసూలు చేయ‌నున్నారు. ఇక తత్కాల్ పై తాజాగా రూ. 1500 పెంచారు. దీంతో ప్ర‌స్తుత‌మున్న రూ.3,500 ఫీజు రూ.5,000కు పెరిగింది.
  •  60 పేజీలు ఉన్న సాధార‌ణ పాస్‌పోర్ట్‌పై రూ.1500 పెంచారు. ఫ‌లితంగా ఇప్పుడున్న ఫీజు రూ.2,000 నుంచి రూ.3,500కు చేరింది. ఇదే తత్కాల్‌ విధానంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.4,000 చెల్లిస్తుండగా, ఇకపై రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది.
    పాస్‌పోర్ట్ పోయినా లేదా పాడైపోయినా (పునరుద్ధరణ)..
  • 36 పేజీలకు సంబంధించి సాధారణ విధానంలో రూ.5వేలు, తత్కాల్ లో అయితే రూ.7,500 చెల్లించాలి.
    60 పేజీలకు సాధారణ విధానంలో ఇక నుంచి రూ.6వేలు, తత్కాల్ విధానంలో ₹8,500 వసూలు చేస్తారు.
  • 18 ఏళ్ల లోపు మైనర్లకు36 పేజీల పాస్‌పోర్ట్ విష‌యానికి వ‌స్తే..
  • సాధారణ విధానంలో రూ.1,750 , తత్కాల్ విధానంలో రూ.4,250 ఫీజుగా నిర్ణయించారు.
  • పాడైన/పోయిన వాటి స్థానంలో కొత్తది కావాల‌నుకుంటే.. ఇక‌పై సాధారణ విధానంలో రూ. 4,250, తత్కాల్ విధానంలో ₹6,750 చెల్లించాల్సిందే.
    ఇత‌ర సేవ‌ల‌పై పెరిగిన చార్జీలు ఇలా..
    పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ విషయానికి వ‌స్తే.. మ‌న‌దేశంలో అయితే ఫీజు రూ.750 వ‌సూలు చేస్తారు. విదేశాల్లో అయితే రూ. 4వేలు చెల్లించాల్సి ఉంటుంది.
    సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ విష‌యంలో భార‌త్‌లో రూ. వెయ్యి, విదేశాల్లో అయితే సుమారు రూ.5వేల‌ ఫీజుగా ఖ‌రారు చేశారు.
  • ఇది కూడా చ‌ద‌వండి.. ‘బయలాట’కు కొత్త ఊపిరి

Bayalata | ‘బయలాట’కు కొత్త ఊపిరి

  • తెలంగాణ గ్రామీణ సంస్కృతికి పునరుజ్జీవం
  • బీజీఏ థియేటర్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ చేయూత‌

Bayalata | కాలం మారుతున్నా… వినోద రూపాల్లో మార్పులొస్తున్నా.. గ్రామీణ సంస్కృతిలో భాగ‌మైన ప‌లు క‌ళారూపాలు నేటికీ ప‌ల్లె ముంగిట‌ క‌దలాడుతూనే ఉన్నాయి. భావి త‌రాల‌కు వార‌స‌త్వ సంప‌ద‌గా నిలుస్తున్నాయి. ప‌ల్లె గుండెలో పుట్టి… ప్రజల జీవితాలతో మమేకమై… సాంస్కృతిక వార‌ధిగా మారిన‌ క‌ళారూపాల్లో బ‌య‌లాట ఒక‌టి. ఆద‌ర‌ణ క‌రువైన ఇప్ప‌టికీ ప్ర‌త్యేక‌త‌ సంత‌రించుకున్న ఈ క‌ళ‌కు పున‌రుజ్జీవం అందించేందుకు ప‌లు సంస్థ‌లు చేయూత‌నందించేందుకు ముందుకు వ‌చ్చాయి.
ఈ క‌ళ ప్ర‌త్యేక‌త‌లు..
బయలాట (Bayalata) అనేది బహిరంగ వీధి నాటక ప్రక్రియ. దీనిని తెలుగులో వీధి నాటకాలు లేదా యక్షగానం అని కూడా పిలుస్తారు. ఆరుబ‌య‌ట, ఆలయాల ఎదుట తాత్కాలిక వేదికలు ఏర్పాటు చేసి రాత్రంతా ప్రదర్శిస్తారు. ఇతిహాసాలు, పురాణాలు, స్థానిక వీరుల కథలే ప్రధానాంశాలుగా ఉంటాయి. వీటిలో దశరత్, సన్నత, దొడ్డట, యక్షనాగ మొదలైనవి ప్ర‌ధాన‌ రూపాలు. హార్మోనియం, డ్రమ్స్ (చండే) , తాళాలతో పాటు నృత్యం, గానం ఇందులో ప్రత్యేక ఆకర్షణ.
అప్పిరెడ్డిప‌ల్లిలో వ‌ర్క్‌షాప్‌..
ఈ జానపద కళను మరింత బలోపేతం చేయ‌డంతో పాటు భావితరాలకు అందించాల‌నే ల‌క్ష్యంతో బీజీఏ థియేటర్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా సంక‌ల్పించింది. ఈమేర‌కు క‌ళాకారుల‌కు ప్ర‌త్యేక‌ శిక్షణ ఇచ్చి కొత్త అవకాశాలు కల్పించాల‌ని భావించింది. ఇందులో భాగంగా 60 రోజుల బయలాట డ్రామా ట్రైనింగ్ వర్క్ షాప్‌న‌కు శ్రీ‌కారం చుట్టింది. నారాయణపేట జిల్లా, మద్దూరు మండలం, అప్పిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం రాత్రి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఆగస్టు 25వ తేదీ వరకు శిబిరం కొన‌సాగ‌నుంది. ఇందులో కళకు సంబంధించిన అభినయం, సంభాషణ, గాత్ర నైపుణ్యం, రంగస్థల నిర్వహణ, పాత్రల రూపకల్పన, జానపద ప్రదర్శన శైలులు వంటి అనేక అంశాలపై క‌ళాకారుల‌కు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా థియేటర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకాంత్ కాడం మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న బయలాట నాటక కళను సంరక్షించడం మాత్రమే కాకుండా దానిని భావితరాలకు చేరవేసి… కళాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ వర్క్ షాప్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అంత‌రించి పోతున్న క‌ళ‌కు జీవం పోస్తున్న వీరిని ప‌లువురు క‌ళాభిమానులు ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి.. సనత్‌నగర్ టిమ్స్‌లో ఉద్యోగావ‌కాశాలు.. ఆల‌స్య‌మెందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

TIMS | సనత్‌నగర్ టిమ్స్‌లో ఉద్యోగావ‌కాశాలు.. ఆల‌స్య‌మెందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

TIMS | హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) త్వ‌ర‌లో అధికారిక ప్రారంభోత్స‌వానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగా వైద్య సేవల‌ను మరింత బలోపేతం చేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది. పోస్టుల‌ భ‌ర్తీ పై దృష్టి సారించింది. ఈ బాధ్యతను నిమ్స్ కు అప్పగించింది. టిమ్స్‌లో వివిధ విభాగాల్లో మొత్తం 184 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు గుర్తించింది. వీటిని కాంట్రాక్ట్ , ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేసేందుకు నిమ్స్ మంగ‌ళ‌వారం మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వైద్య విభాగం, సాంకేతిక అనుబంధ ఆరోగ్యం, ప‌రిపాల‌న , స‌హాయ‌క‌ సర్వీసుల్లో ఉన్న ఈ ఖాళీలకు అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూలై 6 వరకు అవకాశం కల్పించింది.

  • పోస్టుల‌ వివ‌రాలు ఇలా…
    వైద్య విభాగం : 31
    ఇందులో ఐదు ప్రొఫెసర్ పోస్టులు, రెండు అసోసియేట్ ప్రొఫెసర్‌, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన వారిని యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సీటీవీఎస్ త‌దిత‌ర‌ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నియ‌మిస్తారు.
    సాంకేతిక , అనుబంధ ఆరోగ్యం : 122
    టెక్నీషియ‌న్ పోస్టుల్లో ప్ర‌ధానంగా బ్ల‌డ్‌ బ్యాక్‌, ఎంఆర్ఐ, సీటీ, ఎక్స్‌రే, క్యాత్ ల్యాబ్, ల్యాబ్, అనస్థీషియా, సీఎస్‌ఎస్‌డీ, ఈసీజీ, బయోమెడికల్ విభాగాల్లో ఉన్నాయి. ఇక అనుబంధ ఆరోగ్య విభాగాల‌ను ప‌రిశీలిస్తే మెడికల్ రికార్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, స్టాటిస్టిషియన్, రిజిస్ట్రార్, అకౌంట్స్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి.
    ప‌రిపాల‌న స‌హాయ‌క సిబ్బంది : 31
    న్యాయ అధికారి, పీఆర్వో, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్లు, పర్‌ఫ్యూజనిస్టులు, బయోమెడికల్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హార్డ్‌వేర్‌ఇంజినీర్ వంటి పోస్టుల తో పాటు ఫైర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్లు, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్, ప్లాస్టర్ అసిస్టెంట్లు వంటివి ఉన్నాయి.
  • గుర్తుంచుకోండి..
    వైద్య విభాగం పోస్టులకు జూలై 6న ఉదయం 9 గంటలకు నిమ్స్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయి.
    టెక్నికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ తదితర పోస్టులకు జూలై 6 సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్‌లో ద‌ర‌ఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఇంటర్వ్యూ, రాతపరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ చేప‌డుతారు.
  • అర్హతలు , వయోపరిమితి వివరాలు
    వైద్య విభాగం పోస్టులకు ..: సంబంధిత సూపర్ స్పెషాలిటీ విభాగంలో DM/M.Ch/DNB/DrNB అర్హత ఉండాలి. అలా గే నిమ్స్ , ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం బోధనా అనుభవం త‌ప్ప‌నిస‌రి. ఆయా విభాగాలు అనుస‌రించి గరిష్ఠ వయోపరిమితి 50 నుంచి 58 సంవత్సరాలు.
    మిగ‌తా పోస్టుల‌కు : సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఎస్సీ, డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర విద్యార్హతలను నిర్ణయించారు. వయోపరిమితి ప్ర‌భుత్వ నిబంధనల ప్రకారం వ‌ర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5ఏళ్ల‌, దివ్యాంగులకు 10ఏళ్ల‌ స‌డ‌లింపు ఉంటుంది.
  • దరఖాస్తు, ఫీజుల వివ‌రాలు..
    వైద్య విభాగం పోస్టులకు అర్హులైన వారు నిమ్స్ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంపూర్తి చేయాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ పత్రాలతో జూలై 6 న ఉదయం 9 గంటలకు నిమ్స్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఫీజు జ‌న‌ర‌ల్ అభ్యర్థులకు రూ. 2వేలు , ఎస్‌సీ, ఎస్‌టీ వారు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది.
    ఇతర పోస్టులకు నోటిఫికేషన్‌లో ఇచ్చిన ద‌రఖాస్తు పూర్తి చేయాలి. విద్యార్హత పత్రాల జిరాక్స్‌లను జతపరిచి జూలై 6వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్ కార్యాలయంలో స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది.జ‌న‌ర‌ల్ అభ్యర్థులు రూ.1,000 , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
  • ఈ ఫీజును ‘ది డైరెక్ట‌ర్‌, నిమ్స్‌, హైద‌రాబాద్’ పేరిట డీడీ రూపంలో లేదా నిమ్స్ ఐపీ బిల్లింగ్ కౌంటర్ వద్ద నేరుగా చెల్లించ‌వచ్చు.
  • ఇది కూడా చ‌ద‌వండి.. మెగాస్టార్ ను క‌లిసిన బీజేపీ చీఫ్‌..చిరు మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..?

Chiranjeevi | మెగాస్టార్‌ను క‌లిసిన బీజేపీ చీఫ్‌.. చిరు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారా..?

Chiranjeevi | మెగాస్టార్ మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా.. బీజేపీ నుంచి ఏమైనా ఆహ్వానం అందిందా.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు అనుమానాల‌కు తావిస్తుండ‌గా.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తికరంగా మారాయి.  అయితే క‌మ‌లం పార్టీ మాత్రం అదేం లేద‌ని కొట్టి పారేస్తుంది. 
అర‌గంట పాటు చ‌ర్చ‌..
తెలంగాణ బీజేపీ చీఫ్‌ రామచంద్రరావు సోమవారం చిరంజీవిని ఆయ‌న ఇంట్లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు.  కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఇటీవల 12ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ‘విశేష్‌ జన్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పుష్కర కాలంలో కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు సాధించిన విజయాలు, కీలక ఘట్టాలను వివరించే పుస్తకాన్ని చిరంజీవికి  అందజేసిన‌ట్లు రామ‌చంద్ర‌రావు తెలిపారు.  స‌మాజం, సంస్కృతి, దేశ నిర్మాణం, సినీరంగం, సంక్షేమ ప‌థ‌కాలు తదితర అంశాలపై చర్చించినట్లు  పేర్కొన్నారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖుల‌ను క‌ల‌వ‌డంలో భాగంగా మెగాస్టార్‌ను కూడా క‌లిసిన‌ట్లు వివ‌రించారు. ఇందులో ఎలాంటి రాజ‌కీయ చ‌ర్చ లేద‌ని స్ప‌ష్టం చేశారు.  అయితే పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో మాత్రం చిరు మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అనే చ‌ర్చ మొదలైంది.
చిరంజీవి రాజకీయ ప్రస్థానం ..
సామాజిక మార్పు, సమన్యాయం నినాదాలతో చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ (PRP)ని  స్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలను కైవ‌సం చేసుకున్నారు. మెగాస్టార్‌ స్వ‌యంగా రెండు చోట్ల పోటీ చేసి తిరుపతిలో విజ‌యం సాధించారు. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం ఊపందుకున్న స‌మ‌యంలో అనూహ్య, ఆస‌క్తిక‌ర‌ రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో 2011 ఆగస్టులో పీఆర్పీని నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటుతో పాటు కేంద్ర‌ మంత్రి పదవి వ‌రించింది.  2012 అక్టోబర్ నుంచి 2014 మే వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొన‌సాగారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో హ‌స్తం పార్టీ పూర్తిగా బ‌ల‌హీన ప‌డింది. ఈ క్ర‌మంలో వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అప్ప‌టి నుంచి పూర్తిగా సినీరంగానికే ప‌రిమిత‌మ‌య్యారు.  కాగా, చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతుండ‌గా.. కేంద్రంలోని ఎన్డీఏలోనూ కీల‌క భాగ‌స్వామి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో రానున్న రోజుల్లో మెగాస్టార్‌ను బీజేపీలోకి ఆహ్వానించి ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు ఏమైనా అప్ప‌గిస్తారా అనే ఊహాగానాలు ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో వినిపిస్తున్నాయి.

Greater news | మారిన ‘గ్రేట‌ర్’..  ఎవ‌రికి క‌లిసొచ్చేనో?

Greater news | ఇటీవ‌ల పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటి ఊపుమీదున్న రేవంత్‌ స‌ర్కారు గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై దృష్టి సారిస్తోంది. స‌ర్ (SIR) ప్ర‌క్రియ పూర్త‌యిన వెంట‌నే న‌వంబ‌ర్‌లో నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అయితే ఈ సారి  గ్రేట‌ర్ ప‌రిధి మూడు కార్పొరేష‌న్లుగా మారింది. జీహెచ్ఎంసీతో పాటు అద‌నంగా సైబరాబాద్‌, మల్కాజిగిరి మునిసిపల్‌ కార్పొరేషన్లు చేరాయి. డివిజన్ల సంఖ్య కూడా 150 నుంచి 300కు పెరిగాయి.  ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు నెల‌లే గ‌డువు ఉండ‌డంతో ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధం అవుతున్నాయి. శ్రేణులతో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తూ గెలుపే లక్ష్యంగా పావులు క‌దుపుతున్నాయి. గ‌తంలో రెండు సీట్లు మాత్ర‌మే ఉన్న కాంగ్రెస్ ఈ సారి ఎలాగైనా పీఠం ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది. ఇక‌ గులాబీ పార్టీ హ్యాట్రిక్ పై దృష్టి సారించింది. ప‌తంగి పార్టీ గ‌తంతో పోల్చితే సారి మ‌రిన్ని సీట్లు పెంచుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో దూసుకొచ్చిన క‌మ‌లం పార్టీ ఈ సారి గ్రేట‌ర్‌లో ఎలాగైనా  పాగా వేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌ల  నూత‌న పార్టీగా ఆవిర్భ‌వించిన టీఆర్ ఎస్ (తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌) కూడా  ఈ ఎన్నిక‌లను స‌వాలుగా తీసుకుంటోంది.  మ‌రోవైపు టీడీపీ మ‌ళ్లీ తెలంగాణ‌లో పున‌ర్‌వైభ‌వం కోసం పావులు క‌దుపుతోంది. అలాగే జ‌న‌సేన సైతం ఇక్క‌డ పోటీకి సై అంటోంది.
2016, 2020 గ్రేట‌ర్‌ ఫ‌లితాలు ఇలా.. 
  • 2016 ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి విజ‌య దుందుబి మోగించింది. ఏకంగా 99 సీట్ల‌తో  అధ్య‌క్ష పీఠం కైవ‌సం చేసుకుంది. సున్నా నుంచి సెంచ‌రీ మార్కుకు చేరువైంది.  ఈ ఎన్నిక‌ల్లో ఏఐఎంఐఎం 44 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే బీజేపీ నాలుగు సీట్ల‌కు ప‌రిమితం కాగా.. గ‌తంలో 52 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం రెండు  స్థానాల‌కు ప‌డిపోయింది. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌రిమిత‌మైన‌ టీడీపీ ఒక స్థానంతో ఉనికి చాటుకుంది.
  • ఇక 2020 ఫలితాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. రాష్ట్రంలో రెండో సారి తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలో కొన‌సాగినా గ‌తంతో పోల్చితే స్థానాలు త‌గ్గాయి. అయితే 55 స్థానాల‌తో టాప్‌లో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ప‌తంగి పార్టీకి ఈ సారి కూడా 44 స్థానాలే ద‌క్కాయి. బీజేపీ మాత్రం పూర్తిగా బ‌ల‌ప‌డింది. 4 నుంచి 48 స్థానాల‌కు ఎగ‌బాకింది. రాజ‌ధానిలోనూ క‌మ‌లం పార్టీ బలోపేతమైనట్లుగా సంకేతాలిచ్చింది. ఈ సారి కూడా కాంగ్రెస్ రెండు సీట్ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. సైకిల్ పార్టీ ఈ సారి కోటా తెర‌వ‌లేదు.
మారిన గ్రేట‌ర్ స్వ‌రూపం .. 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్వరూపం ఇటీవ‌ల మారిపోయింది. జీహెచ్​ఎంసీని ప్ర‌భుత్వం మూడు కార్పోరేష‌న్లుగా పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌, మల్కాజిగిరి మునిసిపల్‌ కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్‌ఎంసీ గ‌త పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026 వ తేదీతో ముగిసిన విష‌యం తెలిసిందే. ఆ వెంట‌నే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్ర‌స్తుతం గ్రేట‌ర్ ప‌రిధిలో ప్ర‌త్యేక అధికారుల పాల‌న సాగుతోంది.
పెరిగిన డివిజన్లు..
గ‌తంలో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 150 డివిజన్లు ఉండ‌గా.. డీలిమిటేషన్ త‌ర్వాత 243కు చేరాయి. విలీన మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ల‌ పరిధిలో మ‌రో 57 నూత‌నంగా ఏర్పాటయ్యాయి. ప్ర‌స్తుతం ఈ సంఖ్య‌ 300 కు చేరింది.
జోన్లు ఇలా.. 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిని ఆరు జోన్లు (శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌)గా, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా విభజించారు.  సైబరాబాద్‌ కార్పొరేషన్‌లో మూడు జోన్‌లు(శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌), 76 డివిజన్లుగాఉన్నాయి. మల్కాజిగిరిని ప‌రిశీలిస్తే ఈ కార్పొరేషన్ ప‌రిధిలో ఎల్‌బీనగర్, ఉప్పల్‌, మల్కాజిగిరి మూడు జోన్లుగా ఉండ‌గా డివిజన్లు 74 ఉన్నాయి.