Thursday, April 16, 2026
spot_img
Home Blog

Junk Food | తల్లులూ.. మీ పిల్లలు జాగ్రత్త..! ఈ ఫుడ్ కు కాస్త దూరంగా ఉంచండి

Junk Food | త్వరలోనే వేసవి సెలవులు రాబోతున్నాయి. తల్లుల్లారా.. మీ పిల్లల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వైద్య నిపుణులు సూచిస్తున్న జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచండి. అవి ఏంటి.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఓ సారి తెలుసుకుందామా మరి.

1. ఆలూచిప్స్: అతిగా ప్రాసెస్ చేయబడిన వీటిలో సోడియం, కొవ్వు, క్యాలరీలు ఎక్కువ. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒబెసిటీ, బీపీ, గుండె జబ్బులకు దారితీస్తాయి. అక్రిలమైడ్ అనే రసాయనంతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది.

2. వైట్ బ్రెడ్: మైదాతో చేసిన వైట్ బెడ్ లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువ. ఫలితంగా షుగర్ లెవల్స్ పెరిగి టైప్ 2 డయాబెటిక్ వచ్చే అవకాశం లేకపోలేదు.

3. ప్రాసెస్డ్ మీట్ : ప్రాసెసింగ్ చేసిన మాంసం( సూపర్ మార్కెట్లలో లభించే రెడ్ మీట్)తో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

4. ఫ్రెంచ్ ఫ్రైస్ : టేస్టీ స్నాక్ గా పేరున్న వీటిని తరచూ తింటే (వారంలో మూడు సార్లకు మించితే) ఒబెసిటీ, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిక్, క్యాన్సర్ కూ దారి తీయవచ్చు. హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల అధ్యయంలో ఇది తేలింది.

5. బర్గర్ : ఇందులో కొవ్వు, క్యాలరీలు అధికం. తరచూ తింటే ఒబెసిటీ బారిన పడతారు. కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు తలెత్తుతాయి.

6. కుకీస్ ; వీటి తయారీలో వినియోగించే ఛాన్స్ పాడ్స్, హైడ్రోజనెట్స్ ఆయిల్స్ తో అనారోగ్య సమస్యలు వస్తాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు పేర్కొంటున్నారు.

7. మైక్రో ఓవుడ్ పాప్ కార్న్ : మైక్రో ఓవెన్ లో తయారు చేసే పాప్ కార్న్ లో అక్టోనోలీడ్ యాసిడ్స్ చేరి లివర్, బ్లాడర్ క్యాన్సర్ కు దారి తీయవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

8. డోనట్స్ : మైదాతో చేసిన వీటిలో కొవ్వు, అధిక కేలరీలు ఉండడం వల్ల ఒబెసిటీ, టైప్-2 డయాబెటిక్, గుండె సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి

9. ఐస్ క్రీమ్: సమ్మర్ లో వీటిని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం బారిన పడడంతో పాటు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.

10. కేక్ : ఇందులో రసాయనాలు, కృత్రిమ రంగులు ఎక్కువగా వాడడం వల్ల అలర్జీ,శాస సమస్యలతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాబట్టి పేరెంట్స్ వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాం.

ఇది కూడా చదవండి : టెట్ సరే.. డీఎస్సీ ఎప్పుడు?

US-Iran talks | రెండో విడత చర్చలకు సిద్ధమా.. ఈసారి వేదిక జెనీవానా..?

US-Iran talks | పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్ వేదికగా అమెరికా(america), ఇరాన్(iran) మధ్య జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి చర్చలకు సిద్ధమని రెండు దేశాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. అయితే ఈసారి వేదిక మారనున్నట్టుగా తెలుస్తుంది.
ఈ నెల 21వరకు సీజ్ ఫైర్

ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు 39 రోజుల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాలు చర్చలను స్వాగతిస్తూ రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ సీజ్ ఫైర్ కు ఈ నెల 21వరకు గడువు ఉంది. అప్పటివరకు మరోసారి చర్చలు జరిపేందుకు అటు వైట్ హౌస్ నుంచి.. ఇటు ఇరాన్ నుంచి తాజాగా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినా ఇరాన్ కండిషన్స్ అప్లైగా పేర్కొంటుడడం గమనార్హం.
వేదిక మారనుందా..
తొలి విడత చర్చలకు సంబంధించి పాక్ వైఖరి పై ఇరాన్ కొంత గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అమెరికా వ్యూహంలో భాగంగా పాక్ వ్యవహరిస్తుందంటూ చర్చల అనంతరం ఆ దేశ డెలిగేట్స్ ఇచ్చిన లీకుల ఆధారంగా బయటకు వచ్చింది. ఈ క్రమంలో కొంత శాంతి ప్రదేశంగా పేరున్న జెనీవా వేదికను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు చైనా, రష్యా, ఇండియా కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా అణు కార్యక్రమం, హోర్ముజ్ జల సంధి పీఠముడిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇజ్రాయిల్ కూడా ఈసారి చర్చల్లో తప్పనిసరిగా ఉండాలని ఇరాన్ పట్టుబడుతుంది. అయితే తదుపరి చర్చలు ఎక్కడ ఉంటాయి.. ఈసారి ట్రంప్ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి : హోర్ముజ్.. ‘సంధి’ చిన్నది.. రవాణా పెద్దది

NFBS | దుఃఖంలో బాసటగా.. కుటుంబ పెద్ద మరణిస్తే కేంద్ర సాయం

NFBS | అనుకోని సందర్భంలో కుటుంబ పెద్దను కోల్పోతే బాధిత కుటుంబానికి కేంద్రం అండగా నిలుస్తోంది. ఆర్థిక సాయం అందిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం (NFBS)గా ఏప్రిల్,12, 2017 నుంచి ఈ పథకం అమలవుతుంది.
పథకం వివరాలు
* 18 నుంచి 59 సంవత్సరాల మధ్య గల కుటుంబ పెద్ద మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సాయం అందుతుంది.
* మృతుడు బీపీఎల్ జాబితాలో ఉండాలి.
* సహజ/ ప్రమాద మరణం ఏదైనా వర్తిస్తుంది.
ఈ డాక్యుమెంట్స్ కావాలి
* మృతుడి డెత్ సర్టిఫికెట్
* ఆధార్ కార్డ్
* రేషన్ / బీపీఎల్ కార్డ్
* బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
* కుటుంబ సభ్యుల గుర్తింపు వివరాలు
* పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
అప్లై చేసుకోవాలిలా..
* మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఎంపీడీవో ద్వారా,పట్టణ ప్రాంతంలో వారికి మున్సిపల్ కమిషనర్ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు.
* గమనిక : మరణం సంభవించిన తేదీ నుంచి రెండేళ్లలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఇది కూడా చదవండి :  టెట్ సరే.. డీఎస్సీ ఎప్పుడు?

Dsc | టెట్ సరే.. డీఎస్సీ ఎప్పుడు?

Dsc | డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తి చేసుకుని ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా కేవలం టెట్ నిర్వహిణకే సర్కారు పరిమితమవుతుందన్న విమర్శ వారి నుంచి వినిపిస్తుంది.
మరోసారి టెట్
టెట్నో(tet) టిఫికేషన్ ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈనెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. జూన్ 9 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ ఉంటుందని పేర్కొంది. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ వచ్చాక కేవలం రెండు సార్లు మాత్రమే
నీళ్లు..నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్తో తెచ్చుకున్న తెలంగాణలో పుష్కరకాలంగా కేవలం రెండుసార్లు మాత్రమే డీఎస్సీ నిర్వహించడం పరిస్థితికి అద్దం పడుతుంది. 2017 అక్టోబర్ లో తొలిసారిగా, 2024 డిసెంబర్ లో రెండోసారి ఈ నియామక పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వాలకు నిరుద్యోగులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.
లక్షల్లో అభ్యర్థులు
రాష్ట్రంలో బీఈడీ(bed), డీఈడీ(ded) పూర్తి చేసిన అభ్యర్థుల ప్రస్తుతం 3లక్షలకు పైనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏటా నిర్వహించే టెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 9సార్లు టెట్ నిర్వహించగా.. కేవలం రెండుసార్లు మాత్రమే డీఎస్సీ నిర్వహించడం గమనార్హం.
పోస్టులు వందల్లో.. పోటీ వేలల్లో
గత రెండు డీఎస్సీల్లోనూ చాలా జిల్లాల్లో పోస్టుల సంఖ్య వంద నుంచి మూడు వందలు లోపు మాత్రమే ఉండగా.. సబ్జెక్టుల వారీగా ఈ సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. మరికొన్ని చోట్ల ఒక్కటి కూడా లేకపోవడం పరిస్థితికి అర్థం పడుతుంది. ఈ క్రమంలో పుస్తకాలతో అహోరాత్రులు కుస్తీ పట్టిన అభ్యర్థులు రిజర్వేషన్ కలిసి రాకో.. సల్ప తేడాతో ఉద్యోగానికి దూరమైన వారు ఎందరో . అలాంటి వారు మరో అవకాశం కోసం పుస్తకాలను వీడకుండా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.
డీఎస్సీ అవసరమంటున్న విద్యావేత్తలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తూనే ఉంది. సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను ఆర్థిక భారమైన ప్రైవేటుకు పంపేందుకు వెనుకాడడం లేదు. పాఠశాల విద్యను బలోపేతం చేయాలనుకున్న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి నూతన విద్యా సంవత్సరం వరకు ఉపాధ్యాయులను అందుబాటులోకి తేవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అక్కడ రూ.2లకే లీటర్ పెట్రోల్

Chitchat war | బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి

Chitchat war | ‘పేరు’తో మొదలైన ఆ పోరు చినికి చినికి గాలి వానగా మారిందా.. అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి తాజా పరిస్థితులు. కొత్త పార్టీ వేళ ఇటు కవిత(kavitha).. అటు కేటీఆర్(ktr) చిట్‌చాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
ఎవరేమన్నారంటే..
కొత్త పార్టీ పేరు విషయంలో జాగృతి అధ్యక్షురాలు ఇటీవల చిట్‌చాట్‌లో ‘బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. దానిని ఎవరైనా వాడుకోవచ్చని..’ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనిపై గులాబీ పార్టీలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో కేటీఆర్ తాజాగా చిట్‌చాట్‌లో చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ‘ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీపరంగా నష్టపోయాం.. మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పును పరిశీలిస్తున్నాం.. అయితే అధినేత నిర్ణయమే ఫైనల్‌’ అంటూ చెప్పకొచ్చారు. అలాగే ‘మా నుంచి తప్పులు తెలుసుకున్నాం.. సరిదిద్దుకుంటున్నాం..’ అనడంతో పాటు.. ‘జైలుకు వెళితేనే సీఎం అవుతారనేది భ్రమ..’ అంటూనే  ‘ పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు.. కానీ ఏడిపించకూడదు ‘ అంటూ పరోక్షంగా కవితను ఉద్దేశించి చేసిన విమర్శలు ప్రస్తుతం పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చకు దారి తీశాయి.
జాగృతి నుంచి ప్రతి విమర్శలు..
జాగృతి నుంచి కూడా ప్రతి విమర్శలు మొదలయ్యాయి. మీడియా డిబేట్ల‌లో ఇప్పటికే ప‌లువురు స్పందిస్తున్నారు.

  • ‘ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మా పార్టీని టార్గెట్‌ చేసే క్రమంలో నా బిడ్డను అరెస్టు చేసిందని, ఆమె ఏ తప్పు  చేయలేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే విషయాన్ని.. ‘ సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. న్యాయస్థానం కూడా ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం మరిచిపోయారా.. అని పేర్కొంటున్నారు. మరోవైపు ‘ జైలుకు పోతే కాదు.. జైలుకు పంప‌బ‌డితే ముఖ్య‌మంత్రులు అవుతున్నార‌నే విష‌యాన్ని రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
  • గతంలో పార్టీ పరిస్థితులను.. కవిత లేఖ ద్వారా వివరించి సరిచేసుకుంటే బాగుంటుందని పేర్కొంటే దానిని అధిష్టానం తీవ్రంగా పరిగణించ లేదా.. ఈ క్రమంలోనే చివరికి ఆమెపై వేటు వేయలేదా.. ఇప్పుడు అదే అంశాన్ని కేటీఆర్‌ ‘మా నుంచి కూడా కొన్ని తప్పులు జరిగాయి.. సరిదిద్దుకుంటున్నాం’ అంటూ పేర్కొనడం ఆలస్యంగా మేల్కొన్నట్లుగా భావించ‌వ‌చ్చా.. అని పేర్కొంటున్నారు.
  • ఇంటి ఆడబిడ్డను ఓ వ్యక్తి అసభ్యకరంగా తూలనాడితే కనీసం స్పందించలేదని, ‘ఆడబిడ్డ ఏడుపు ఇంటికి మంచిదా..’ అని కూడా ప్రశ్నిస్తున్నారు.
  • ఇలా అన్న చెల్లెలు చిట్ చాట్ సంద‌ర్భంగా చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లతో రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నాయి.
  • ఇది కూడా చదవండి : కళ్ల ముందున్నా.. కలవనంత దూరమాయే! తండ్రి ఆజ్ఞ.. బిడ్డ ప్రతిజ్ఞ..ఆ తల్లికి మాత్రం తప్పని క్షోభ!

kavitha party | ఆమె అడుగులు.. వ్యూహాత్మ‌కం!

kavitha party | ప‌శ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్ర‌మ‌వుతుండ‌గా .. తెలంగాణ‌లో పొలిటిక‌ల్ వార్ మొద‌లైంది. ఈనెల 25న కొత్త పార్టీగా రాబోతున్న‌ట్లుగా క‌విత ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జాతీయ పార్టీలే ఉన్నాయ‌ని తాము ‘తెలంగాణ’ ఆత్మ‌గా ఇంటి పార్టీగా రాబోతున్నామ‌ని వెల్ల‌డించారు. మ‌రోవైపు ఆమె వ్యూహాత్మ‌క అడుగులు రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆలోచింప‌జేస్తున్నాయి.

పేరుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌..
బీఆర్ఎస్ నుంచి దూర‌మైన జాగృతి క‌విత ప్ర‌జా స‌మ‌స్య‌లే ఎజెండాగా పార్టీ ఏర్పాటుపై దృష్టి సారించగా.. ఆ పేరుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌ మొద‌లైంది. ఈసీ వ‌ద్ద ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా న‌మోదైనట్లుగా లీకులొచ్చాయి. అయితే క‌విత ఇటీవ‌ల మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా ‘బీఆర్ఎస్ గా మారిన తర్వాత ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. దానిని ఎవరైనా వాడుకోవచ్చని..’ చేసిన కామెంట్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో కొత్త‌ పార్టీ టీఆర్ఎస్‌గా ఉంటుంద‌నే మీడియా క‌థ‌నాలు బీఆర్ఎస్‌లో చ‌ర్చకు దారితీశాయి. అయితే కేటీఆర్ తాజాగా చిట్‌చాట్‌లో తాము బీఆర్ఎస్‌తో న‌ష్ట‌పోయామ‌ని త్వ‌ర‌లో టీఆర్ఎస్‌గా మార‌బోతున్న‌ట్లు చేసిన కామెంట్ రాజ‌కీయవ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.
అన్నిపార్టీల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు..
పార్టీ అధినేత్రిగా రానున్న త‌రుణంలో క‌విత‌ పాల‌క పార్టీల‌తో పాటు విప‌క్షాల‌పై విమ‌ర్శ‌ల దాడి పెంచారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌ను ఎండ‌గ‌డుతున్నారు. మ‌రోవైపు కేంద్రంలో బీజేపీ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను తూర్పార ప‌డుతున్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆర్ఎస్‌నూ వ‌ద‌ల‌డం లేదు. ఆ పార్టీ ప్ర‌స్తుతం నిద్రావ‌స్థ‌లో ఉంద‌ని సెటైర్లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌నం గొంతుక‌గా వ‌స్తున్న ఆడ‌బిడ్డ‌ను ఆద‌రించి అక్కున చేర్చుకోవాల‌ని ప్రజలను కోరుతున్నారు. పార్టీ ఆవిర్భావానికి అన్ని వ‌ర్గాలు త‌ర‌లిరావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.
విధి విధానాల‌పై సమాలోచ‌న‌లు
స్వ‌యంగా కేసీఆర్ కుమార్తె అయిన క‌విత ఆలోచ‌న‌లు తండ్రిని పోలి ఉంటున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కొత్త పార్టీ విధి విధానాల‌పై ఆయా రంగాల నిపుణుల‌తో ఆమె సుదీర్ష‌ చ‌ర్చ‌లు అంద‌రినీ ఆలోచింప‌జేస్తున్నాయి. ‘ప్ర‌జా స‌మ‌స్య‌లే ఎజెండాగా.. ప్ర‌శ్నించ‌డమే ల‌క్ష్యంగా’ త‌మ పార్టీ ముందుకు సాగుతుంద‌ని ఆమె ఇదివర‌కే ప్ర‌క‌టించ‌డంతో ఆవిర్భావ స‌భ‌పై అంద‌రి దృష్టి ప‌డింది.

ఇది కూడా చదవండి : స‌గం అయినట్లే.. ఇక పార్టీల చూపు.. ఎన్నికల వైపు!

Be possitive | డాడీ నిన్ను చూడాల‌నిపిస్తుంది.. మమ్మీ అని పిల‌వాల‌నిపిస్తుంది!

Be possitive | ఆ క్ష‌ణం క‌న్నీటి పొర నా దృష్టికి తెరవేసింది.. మెద‌డును మొద్దుబార్చింది. గుండెను రాయిలా మార్చేసింది. ఉద‌యం చెవిని తాకిన ఆ వైఫల్యపు వార్త నా జీవితానికి చరమగీతం పాడింది. క్షణికావేశం మీకు కడుపుకోతగా.. నాకు తీరని వ్యథగా మిగిల్చింది. చదువే సర్వస్వం అనుకునే నేను చివరికి నన్నే కోల్పోవాల్సి వచ్చింది. ఇప్ప‌టికీ ఏడాద‌వుతుంది డాడీ మీకు దూరమై. అమ్మ ఎలా ఉంది.. అక్క బాగుందా.. ఈ రోజు త‌మ్ముడి రిజ‌ల్ట్ అంట క‌దా.. టెన్ష‌న్ ప‌డ‌క‌ను. మార్కులే జీవితం కాద‌ని చెప్పు. వాడి భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇవ్వు. నా మాటగా చెప్పు.

చివరి ప్రయాణం మరచిపోలేక పోతున్నా
నా మీద మీ ప్రేమ‌ను ఆ దేవుడు చూడ‌లేక‌పోయాడేమా.. అందుకే న‌న్ను మీ నుంచి దూరం చేసిన‌ట్లున్నాడు. ఆ రోజు విగ‌త జీవిగా న‌న్ను చూసిన నువ్వు.. “ఎక్క‌డికి పోయిన‌వ్ త‌ల్లీ” అంటూ వెక్కివెక్కి ఏడ్వ‌డం నేను పుట్టిన‌ప్ప‌టి నుంచి చూడ‌లే డాడీ. నా మీద ప‌డి మ‌మ్మీ సొమ్మ‌సిల్లడం చూసి లేపాల‌నిపించింది. కానీ, నా శక్తి స‌రిపోలే. ఫ్రెండ్స్‌ అంతా “మ‌మ్మ‌ల్ని వ‌ద‌లిపోయావా” అంటూ క‌న్నీటితో చేసిన చివ‌రి ప్ర‌యాణం యాదికొస్తనే ఉంది.
తొందరపడకండి..
డాడీ ఎంతో మందికి గైడెన్స్ ఇచ్చే మీరు న‌న్నెందుకు మార్చ‌లేక‌పోయారు. నా మొండిత‌నం, సున్నిత‌త్వం మీకే ఎక్కువ తెలుసు. నేను బాధ‌ప‌డుతా అనుకున్నారా? అదే కాబోలు. అందుకే ఒక్క‌మాట కూడా అన‌లేదు. మార్కులే జీవితం కాదు అని మీరు ప‌దేప‌దే చెప్పినా నేనే వినిపించుకోలేదు. మీ ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌లేక‌పోయా అని భ‌య‌ప‌డ్డా. తొంద‌ర‌ప‌డ్డా. ఆ బలహీన క్ష‌ణం ఖ‌రీదు నా నిండు ప్రాణం. మీకు దూర‌మై నేటికి ఏడాది. ఇక్కడ పలకరించే వాళ్లు లేరు.. తినమని బతిమలాడే మీరు లేరు. ఒంట‌రిగా శూన్యంలో ఉంటున్నా.. ఏడువని రోజులేదు.. డాడీ నిన్ను మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది.. మ‌మ్మీని గ‌ట్టిగా హ‌త్తుకుని ఏడ‌వాల‌నిపిస్తుంది. ఫ్రెండ్స్.. ఒక్క‌టి మాత్రం నిజం.. మార్కులు అంటూ నాలాగా తొంద‌ర‌ప‌డ‌కండి. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోకండి క‌న్న‌వారికి క‌డుపుకోత మిగ‌ల్చ‌కండి.

( ఇంటర్ ఫ‌లితాల వేళ గ‌తేడాది త‌నువుచాలించిన ఓ అమ్మాయి ఆత్మ‌ఘోష‌కు అక్ష‌ర‌రూపం)

Petrol cheap | అక్కడ రూ.2లకే లీటర్ పెట్రోల్!

  • Petrol cheap | ప‌శ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై చూపింది. హోర్ముజ్‌ జ‌ల సంధిని ఇరాన్ మూసివేయ‌డంతో క్రూడాయిల్ ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించింది. పెట్రోల్ ధ‌ర‌ల‌కు ఒక్క‌సారిగా రెక్క‌లోచ్చాయి. అయితే ఆ దేశాల్లో మాత్రం ఇప్పటికీ చాలా చౌకండి. వాటి గురించి తెలుసుకుందామా మ‌రి. ( ఏప్రిల్ 6, 2026 ధరల ఆధారంగా)
    లిబియాలో రూ.2.14 మాత్ర‌మే..
    ప్ర‌పంచంలోనే పెట్రోల్(petorl) ధ‌ర అతి త‌క్కువ‌గా ఉన్న దేశం లిబియా. ఇక్క‌డ లీట‌ర్ కేవ‌లం 0.023 డాల‌ర్లు మాత్ర‌మే. అంటే మ‌న క‌రెన్సీలో రూ. 2.14లు. త‌ర్వాత‌ స్థానాల్లో ఇరాన్ (రూ.2.70), వెనుజులా (రూ.3.26), అంగోలా(రూ.30.43), కువైట్ (రూ.31.55), అల్జీరియా (రూ.32.95), తుర్క‌మెనిస్తాన్ (రూ.39.83), ఈజిప్ట్ (రూ.40.86), క‌జ‌కిస్తాన్ (రూ.48.95),ఖ‌తార్ (రూ.52.30), సౌదీ అరేబియా (రూ.57.79), ఒమ‌న్ (రూ.57.89), ఇరాక్ (రూ.60.40), బెహ్రాయిన్ (రూ.62.36) ఉన్నాయి.
    మన పొరుగు దేశాల్లో
    ఇండోనేషియా(రూ.67.69), భూటాన్ (రూ.85.38), బంగ్లాదేశ్ (రూ.90.50),మాల్దీవులు(రూ.96.46), ఆఫ్ఘనిస్తాన్ (రూ.88.82), ఇండియాలో రూ.101.39, చైనా(రూ.124.86), పాకిస్తాన్(రూ.126.25), నేపాల్(రూ.126.44), శ్రీలంక(రూ.134.26), బర్మా(రూ.141.52)
    అక్కడ మాత్రం చాలా హాట్
    హాంగ్ కాంగ్ లో ప్రపంచంలోనే అత్యధికంగా రూ.384.90 గా ఉంది. తర్వాత మాల్వి(రూ.358.18), నెదర్లాండ్స్(రూ.252.18), డెన్మార్క్(రూ.250.79) ఇజ్రాయిల్(రూ.245.76), మొనాకో(రూ.239.34), జర్మనీ(రూ.235.24), లిచ్ టెస్టిన్(రూ.231.05), సింగపూర్(రూ.223.98), గ్రీస్(రూ.223.79), అల్బెనీయా(రూ.223.70), ఫిన్ ల్యాండ్(రూ.219.69), స్విట్జర్లాండ్(రూ.218.58), ఫ్రాన్స్(రూ.215.04)
  • ఇది కూడా చదవండి : స‌గం అయినట్లే.. ఇక పార్టీల చూపు.. ఎన్నికల వైపు!

Telangana politics | స‌గం అయినట్లే.. ఇక పార్టీల చూపు.. ఎన్నికల వైపు!

Telangana politics | కాంగ్రెస్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు సమీపిస్తుంది. ఇంకో స‌గం పిరియడే మిగిలింది. ఆయా పార్టీలు అప్పుడే ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెడుతున్నాయి. అధికార పార్టీ హామీల అమ‌లుపై దృష్టి సారిస్తుండ‌గా.. విప‌క్షాలు స‌ర్కారు తీరును ఎండ‌గడుతూ క్షేత్ర స్థాయిపై న‌జ‌ర్ పెంచుతున్నాయి. బ‌లం, బ‌ల‌హీన‌త‌ల‌ను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

  • హామీల అమలుపై హస్తం ఫోకస్..
    కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం విధితమే. ఇందులో కొన్ని అమలు చేయగా .. మరికొన్ని మిగిలాయి. ఓ వైపు వెంటాడుతున్న అప్పులు.. మరోవైపు సంక్షేమ పథకాల అమలు సర్కారు కు కత్తి మీద సాముగా మారాయి. ప్రధానంగా నిరుద్యోగ యువతకు సంబంధించి రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలుపై తర్జన బర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే పింఛన్ పెంపు, మహిళలకు రూ.2,500 నగదు, స్కూటీల పంపిణీ, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి హామీలపై దృష్టి సారించాల్సి ఉంది. మరో ఏడాదిన్నర గడిస్తే ఎన్నికల మూడ్ ఉంటుంది. అప్పుడు చేస్తే మైలేజ్ కన్నా నెగిటివ్ ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు పూర్తికాగానే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసి ఎన్నికల ఎజెండాతో ముందుకు సాగేలా ‘హస్తం’అధిష్టానం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.
  • వ్యూహాలకు పదును పెడుతున్న గులాబీ బాస్
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి వరుసగా రెండుసార్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ ను చేజార్చుకుంది. ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఓటరు నాడి తెలిసిన గులాబీ బాస్ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు. మళ్లీ కేసేఆరే కావాలని జనం నుంచి రావాలన్నదే ఆయన లక్ష్యం. క్రియాశీలకంగా కనిపించకున్నా వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతున్నారు పెద్ద సారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ను టార్గెట్ చేసే పనిలో నిమగ్నమవుతున్నారు.
  • పుంజుకుంటున్న ‘కమలం’
    అసెంబ్లీ ఎన్నికల నుంచి కమలం పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటున్నట్లుగా తెలుస్తుంది. శాసనసభ తో పాటు మండలిలోనూ ఆ పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకుంది. లోక్ సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో సగం సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటుకుంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండాను రెపరెపలాడించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గతంలో ఆ పార్టీకి ఊపు తెచ్చిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్(bandi sanjay) కి తిరిగి రాష్ట్ర పగ్గాలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా ఆ పార్టీ శ్రేణుల్లో టాక్. అయితే నేతల మధ్య సమన్వయ లోపం కాషాయ పార్టీకి కొంత మైనస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • అందరి చూపు కవిత పార్టీ పైనే
    ఈనెల 25న పార్టీ ఆవిర్భావం ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే. విధి విధానాలు.. జెండా, ఎజెండాపై ఆమె కసరత్తు చేస్తున్నారు. ‘తెలంగాణ జాగృతి పార్టీ’గా పేరు బయటకు రాగా ‘టీఆర్ఎస్’ గా కూడా ఉండవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. త్వరలో రానున్న జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటి అసెంబ్లీ ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలన్నది కవిత ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఉన్నాయని, తాము ఇంటి పార్టీగా వస్తున్నట్లుగా జాగృతి అధ్యక్షురాలు తాజాగా ప్రకటించారు. జమిలి ఎన్నికల వరకు మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయనున్న క్రమంలో మహిళా అధ్యక్షురాలుగా వస్తున్న ఈ పార్టీని తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.
  • ఇది కూడా చదవండి అవునండీ.. యుద్ధానికి బ్రేక్.. కండిషన్స్‌ అప్లై!

results | ఆ రిజల్ట్స్ ఎప్పుడంటే..

results | ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చేస్తున్నారు. ఈ మేరకు బోర్డు కూడా ఏర్పాట్లను వేగవంతం చేసింది. శుక్రవారం విడుదల చేయనున్నట్లు తెలిసింది.
9.97 లక్షల మంది..
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. మొత్తం 9 లక్షల 97 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే ఫెయిల్ అయిన వారి పేపర్లను అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈనెల 10న ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
జెఈఈ మెయిన్స్
దేశవ్యాప్తంగా రెండో విడత(session 2) జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఎన్టీఏ ఈ నెల 2 నుంచి 8 వరకు నిర్వహించింది. సుమారు 11.23 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 11 లేదా 12న కీ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 20 మధ్యలో ఫలితాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. ఈ నెల 23 నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లుగా ఎన్టీఏ తన వెబ్సైట్లో పేర్కొంది.

ఇది కూడా చదవండి :  అవునండీ.. యుద్ధానికి బ్రేక్.. కండిషన్స్‌ అప్లై!