Thursday, April 16, 2026
spot_img
Home Blog Page 2

War breake | అవునండీ.. యుద్ధానికి బ్రేక్.. కండిషన్స్‌ అప్లై!

War breake | డెడ్‌లైన్ ముగిసింది.. ఇక యుద్ధం తప్పదనే సమయంలో ఎంట్రీ ఇచ్చింది పాకిస్తాన్‌. మధ్యవర్తిత్వం జరిపి సీజ్‌ ఫైర్‌(కాల్పుల విరమణ)కు కారణమైంది. ఇరాన్‌, యూఎస్‌ మధ్య రెండు వారాల చర్చలకు అవకాశం కల్పించింది. హోర్మజ్‌ జలసంధి విషయంలో అంగీకరించిన ఇరాన్‌ తాను పెట్టిన షరతులు.. ట్రంప్(trump) ఇచ్చిన హామీలపై త్వరలోనే ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
చివరి నిమిషంలో..
ఫిబ్రవరి 28న యుద్దం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇజ్రాయిల్‌ అగ్రరాజ్యం సహకారంతో ఇరాన్‌పై దాడులకు పాల్పడుతుండగా అంతే ధీటుగా ఇరాన్‌ కూడా స్పందిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటున్న క్రమంలో ట్రంప్‌ ఓ గడువు విధించారు. అప్పటి వరకు హోర్మజ్ జలసంధి ఓపెన్ చేయాల్సిందే అని ఇరాన్‌కు అల్టీమెటం జారీ చేశారు. లేకుంటే నరకం చూపిస్తామని.. నాగరికతను అంతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఆ గడువు ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ఎంట్రీ ఇచ్చి రెండు వారాల కాల్పుల విరమణ పాటించాలని అమెరికాకు, జలసంధి తెరవాలని ఇరాన్‌కు ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. అయితే తాము పెట్టిన పది షరతులకు అంగీకరిస్తేనే ఓకే అంటూ ఇరాన్‌ ప్రకటించగా.. ట్రంప్‌ సుముఖత వ్యక్తం చేస్తూ కాల్పుల విరమణకు సానుకూలమని చెప్పారు.
సీజ్‌ ఫైర్‌ ప్రకటన తర్వాత పరిణామాలు..

  • పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఈ నెల 10 నుంచి ఇరు దేశాలతో పాకిస్తాన్‌ వేదికగా ప్రత్యక్ష చర్చలు ఉంటాయని ప్రకటించారు.
  • ఇజ్రాయిల్‌ ట్రంప్‌ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగా ప్రకటించినా లెబనాన్‌పై తమ దాడులు కొనసాగుతాయని పేర్కొనడం గమనార్హం.
  • ఇరాన్‌ సుప్రిం నేత మొజ్తాబా ఖమేని ప్రకటనలో స్పందిస్తూ.. కాల్పుల విరమణ మాత్రమే అని.. యుద్ధం విరమించలేదని పేర్కొన్నారు. అలాగే 14 రోజుల పాటు హోర్మజ్‌ జలసంధి వద్ద భద్రత దళాలు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు.
  • ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు 50శాతం సుంకాలు విదిస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు.
  • ఇరాన్‌తో యుద్దంలో తాము విజయం సాధించామని, తమ ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్లుగా అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ప్రకటించారు. ఇరాన్‌ ప్రాధేయపడడంతో ట్రంప్‌ దయచూపినట్లుగా పేర్కొన్నారు.
  • ఇది కూడా చదవండిహోర్ముజ్.. ‘సంధి’ చిన్నది.. రవాణా పెద్దది

TRS Name | ఆ కొత్త పార్టీ టీఆర్ఎస్సా.. ఇది నిజమేనా.. వారిలో కలవరం!

TRS Name | టీఆర్ఎస్.. రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వినిపించిన పేరు. స్వరాష్ట సాధనలో ముందు నిలిచిన గొంతుక. అయితే ఈ గులాబీ పార్టీ పేరు నాలుగేళ్ల క్రితం బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన విషయం విధితమే. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆ పేరు మళ్ళీ తెర మీదికి వచ్చింది. పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

25న కవిత కొత్త పార్టీ

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి ఇటీవల బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత ఈనెల 25న కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ పేరు విషయంలో జాగృతి అధ్యక్షురాలు తాజాగా చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. ‘బీఆర్ఎస్ గా మారిన తర్వాత ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. దానిని ఎవరైనా వాడుకోవచ్చని..’ మీడియా చిట్ చాట్ లో ప్రస్తావించిన అంశం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి కరంగా మారింది. ఈ నేపథ్యంలో కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ టీఆర్ఎస్ అయి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గులాబీ పార్టీ వర్గాల్లోనూ కవిత పార్టీ ఏమిటా అన్నచర్చ జోరుగా సాగుతోంది.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఇలా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా 2001ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించారు. తన ఉద్యమ పంథాతో దశాబ్దాల స్వరాష్ట్ర కల నెరవేర్చారు. ఫలితం 2014లో తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. 2018లోనూ రెండోసారి అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. దేశ రాజకీయాల్లోనూ కీలకంగా మారాలని భావించారు. ఈ క్రమంలో 2022 అక్టోబర్ 5న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (BRS) గా మార్చారు గులాబీ బాస్. అయితే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి హ్యాట్రిక్ అవకాశం చేజారింది. పార్లమెంట్ ఫలితాలు సైతం ‘కారు’ పార్టీకి నిరాశ కలిగించడం గమనార్హం. ‘తెలంగాణ’ పే(రు)గు బంధానికి దూరం కావడమే పార్టీ ఓటమికి ఓ కారణంగా విశ్లేషకులు చెప్పుకొచ్చారు. ఓ దశలో మళ్లీ టీఆర్ఎస్ గా మారితే బాగుంటుందని పార్టీలోనూ చర్చ మొదలైంది.

సెంటిమెంటు పేరును వదులుకుంటారా?

ఉద్యమ పార్టీకి కలిసొచ్చిన టీఆర్ఎస్ పేరు వేరే వాళ్లకు వెళ్లదని.. ఈసీ కూడా తమ అనుమతి లేకుండా వేరే వాళ్లకు ఇచ్చే అవకాశం ఉండదని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మీడియా చిట్ చాట్ లో కవిత కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారగా.. ఆమె పూర్వాశ్రమ పార్టీ బీఆర్ఎస్ ను కలవరపాటుకు గురి చేసింది. ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీ టీఆర్ఎస్సా మరొకటా అనే సస్పెన్స్ కు తెరపడాలంటే ఈ నెల 25 వరకు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి : కోల్‌బెల్ట్‌పై ‘జాగృతి’ ఫోకస్‌.. ‘సేవ్‌ సింగరేణి’ పేరిట ముందడుగు

Borders no change | సరిహద్దుల మార్పులుండవ్‌.. అప్పటి వరకూ నో చేంజ్‌!

Borders no change | రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు ఇప్పట్లో లేనట్లే. అలాగే జిల్లాల పునర్విభజన కూడా ఉండకపోవచ్చు. మరో ఏడాది వరకు బ్రేక్‌ పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఈ విషయాన్ని స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

2027మార్చి చివరి వరకు..
వచ్చే ఏడాది మార్చి 31 వరకు జిల్లా, మండల, గ్రామ సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని కేంద్రం పేర్కొన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో బోథ్ రెవెన్యూ డివిజన్ అంశాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ప్రస్తుతం జన గణన సర్వే నిర్వహిస్తున్న తరుణంలో అది పూర్తయ్యేంతవరకు చేసే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది.
పునర్విభజన నేపథ్యంలో
మరోవైపు జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) కసరత్తు చేపడుతున్న తరుణంలో సరిహద్దుల మార్పులు చేపట్టకూడదని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది.
అప్పటివరకు ఆగాల్సిందే
గతంలో అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాలను శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన చేపట్టడం అవసరమని అసెంబ్లీలో మంత్రి పొంగులేటి(ponguleti) గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. కొత్త జిల్లాలతో ఏర్పాటుతో పాటు కొన్నిచోట్ల మళ్లీ కలపాలని విన్నపాలు వెల్లువెత్తాయి. ఆందోళనలు కూడా మొదలయ్యాయి. జిల్లా, మండల సాధన సమితిలు ఒకసారిగా తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా హుజురాబాద్ ను కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా హనుమకొండ, వరంగల్ ను తిరిగి ఒకే జిల్లాగా మార్చాలని, సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిన హుస్నాబాద్ ను తిరిగి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని, ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలంటూ స్థానికుల నుంచి ఆకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జిల్లాలు చాలావరకు తగ్గుతాయని, కొన్ని సరిహద్దులు మారుతాయని ఊహాగానాలు వినిపించాయి. పార్లమెంటు స్థానాల ఆధారంగా పునర్విభజన జరిగే అవకాశాలు ఉంటాయని రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అయితే తాజాగా సీఎం ప్రకటన నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు ఆగల్సిందే అని స్పష్టమవుతోంది.

ఇది కూడా చదవండి : సీట్లు పెరుగుతున్నాయోచ్.. ఎమ్మెల్యే,ఎంపీ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్..!

save singareni | కోల్‌బెల్ట్‌పై ‘జాగృతి’ ఫోకస్‌.. ‘సేవ్‌ సింగరేణి’ పేరిట ముందడుగు

save singareni |సింగరేణి సంస్థ మనుగడ.. కార్మికుల సమస్యలపై తెలంగాణ జాగృతి ఫోకస్‌ పెంచింది. గతంలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగిన కవిత త్వరలో పార్టీ పెట్టబోతున్న క్రమంలో కోల్‌బెల్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఆమె ఈ ప్రాంతం నుంచే పోటీ చేస్తారా.. అందులో భాగంగా గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారా.. వంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆరు జిల్లాల పరిధిలో కోల్‌బెల్ట్‌
రాష్ట్రంలో కోల్‌బెల్ట్‌ ప్రాంతం ఆరు జిల్లాల పరిధిలో విస్తరించింది. కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సింగరేణి గనులు, ఓపెన్‌కాస్టులు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 12 అసెంబ్లీ, 5 పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి అసెంబ్లీ స్థానాలుగా ఉన్నాయి. లోక్‌సభ విషయానికి వస్తే ఆదిలాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, మహబూబ్‌బాద్‌, ఖమ్మం స్థానాల్లో నల్లసూరీలది కీలక పాత్ర. ఉత్తర తెలంగాణలో ఇవి మెజారిటీ స్థానాలు కావడం గమనార్హం. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
సమస్యల ఎజెండాతో ముందుకు..
టీఆర్‌ఎస్‌(ప్రస్తుత బీఆర్‌ఎస్‌)కు అనుబంధంగా కొనసాగిన టీబీజీకేఎస్‌ సింగరేణిలో గుర్తింపు సంఘంగా వెలుగొందింది. ఆ సమయంలో కవిత గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. దీంతో ఆమెకు ఈ ప్రాంతంపై, కార్మికుల సమస్యలపై అవగాహన ఉంది. త్వరలో పార్టీ పెట్టబోతున్న క్రమంలో బొగ్గు గని కార్మికుల సమస్యలపై ఫోకస్‌ పెంచినట్లు తెలిసింది. ఇందులో భాగంగా తాజాగా ‘సేవ్‌ సింగరేణి’ (save singareni )పేరిట రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి ఐదు తీర్మానాలతో కార్మిక వర్గం దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా డిపెండెంట్‌ ఉద్యోగాల విషయంలో విజిలెన్స్‌ ఎంక్వైరీ చేయాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అలాగే కార్మికవర్గానికి ఇబ్బందికరంగా మారిన నాలుగు నల్ల చట్టాలను అమలు చేసేది లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలన్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటుతో పాటు అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలన్నారు. నైనీ, తాడిచర్ల వంటి బొగ్గు గనులను సింగరేణి సంస్థనే ఆపరేట్ చేయాలన్నారు.
పట్టు సాధించేలా..
ప్రధానంగా సింగరేణి ప్రాంతాల్లో కార్మిక కుటుంబాలతో పాటు పరోక్షంగా ఉపాధి పొందే ఉండే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కార్మికుల సమస్యలపై ఫోకస్‌ చేస్తే రానున్న రోజుల్లో ఆవిర్భవించనున్న కవిత కొత్త పార్టీకి మంచి మైలేజ్‌ ఉండే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఒకవేళ తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ‘ఆమె’కు అందలం దక్కేనా.. రానున్న ఎన్నికల్లో మహిళా శక్తి కీలకం కానుందా?.. ఎవరికి కలిసొచ్చేనో..!

US-Iran war |దూకుడు ఆపని ఆమెరికా.. వెనక్కి తగ్గని ఇరాన్‌.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!

US-Iran war | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగు తూనే ఉన్నాయి. ఇజ్రాయిల్‌ సహ అమెరికా దాడులకు భయపడని ఇరాన్‌ గట్టిగానే స్పందిస్తోంది. తాజాగా బుషేహర్‌లోని న్యూక్లియర్ US-పవర్ ప్లాంట్ లక్ష్యంగా అగ్రరాజ్యం క్షిపణి దాడులకు పాల్పడగా.. యూఎస్ కు చెందిన కీలక యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేస్తూ ధీటుగా బదిలిస్తుంది.హోర్మజ్ జలసంధి విషయంలో ‘మరో 48 గంటల సమయమే ఉందని.. స్పందించకుంటే ప్రళయం తప్పదు’ అంటూ తాజాగా ట్రంప్ చేసిన హెచ్చరికలను సైతం డోంట్ కేర్ అంటుంది ఇరాన్. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన వంతెనను టార్గెట్ చేయడాన్ని ఇరాన్ సీరియస్ గా తీసుకుంది. తమ సత్తా కూడా చూపిస్తామని ప్రకటించింది. గల్ఫ్ దేశాల లక్ష్యంగా దాడులు ఉంటాయని వెల్లడించింది.
టేక్ కంపెనీలపై దృష్టి..
ప్రపంచ దేశాలకు తమ సత్తా చూపాలని భావించిన ఇరాన్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇప్పటికే హార్మోజ్ జలసంధి పై పూర్తి ఆధిపత్యం సాధించి.. అగ్ర రాజ్యానికి ముచ్చెమటలు పట్టించింది. తాజాగా ఇజ్రాయిల్, అమెరికా లోని ప్రముఖ టెక్ కంపెనీలపై దాడులకు సిద్ధమైంది. 18 సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. అంతేకాకుండా యూఎస్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భావిస్తూ ఆ దేశానికి చెందిన కొన్ని బ్యాంకులను కూడా ఇందులో చేర్చింది.
యుద్ధం తీవ్రమైతే
యుద్ధం విషయంలో అమెరికాలో ఓవైపు నిరసనలు వెలువెత్తుతున్నా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు వార్ కు ముందు ఆ దేశంలో కొంత వ్యతిరేకత ఉన్నా అగ్రరాజ్యం దాడుల నేపథ్యంలో ఇరానీయులు ప్రస్తుతం ఒక్కటిగా గళమెత్తుతున్నారు. తమను తక్కువ అంచనా వేసిన యుఎస్ కు సత్తా చూపిస్తామని.. ప్రతి దాడులతో ఆ దేశం డ్రోన్లతో విరుచుకుపడుతుంది ఈ క్రమంలో అంతర్జాతీయ క్రూడాయిల్ వర్తకానికి కీలక రవాణా మార్గమైన హార్మోజ్ ను వజ్రాయుధంగా వాడుకుంటోంది. ఈ ప్రభావం గల్ఫ్ తో పాటు మిగతా దేశాలపై తీవ్రంగా చూపుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల పైనా ఎఫెక్ట్ చూపుతుండడంతో మునుముందు ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : యుద్ధం..ఇంకెంతకాలం.. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ మధ్యలో ట్రంప్..

Fee reimbursement |వారికి షాక్‌..! ఉన్నత విద్య ఇక అందని ద్రాక్షేనా.. కోర్టు తీర్పు ఏంటి.. సర్కారు వైఖరి ఎలా ఉండబోతుంది..?

పేద విద్యార్థులకు ఇక ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందా..అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. రూ.కోట్లలో ఫీజు బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు తాజాగా హైకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో న్యాయస్థాన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఫీజు రీయీంబర్స్‌మెంట్‌ పథకం..
పేద, నిరుపేద వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల సంక్షేమం కోసం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫీజు రీయీంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. కొత్త రాష్ట్రం ఏర్పడినా.. ప్రభుత్వాలు మారినా ఈ పథకం అమలు మాత్రం కొనసాగుతోంది. అయితే బకాయిలు మాత్రం ఏటా రూ.కోట్లలో పేరుకుపోతుండడం గమనార్హం. దీంతో ఆయా కళాశాలలు ఏటా ఆందోళనలకు దిగడం.. ప్రభుత్వం నామమాత్రంగా నిధులు విడుదల చేయడం షరా మామూలుగా మారింది.
హైకోర్టును ఆశ్రయించిన కాలేజీలు
బకాయిల చెల్లింపు విషయంలో టోకెన్లు జారీ చేసిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్‌ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులకు వేతనాలు సైతం చెల్లించలేకపోతున్నామని, కళాశాలలు నడిపే పరిస్థితి లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాయి. విచారణ జరిపిన కోర్టు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి (2026-27 విద్యా సంవత్సరం) ఫీజు వసూలు చేసుకోవచ్చని ప్రైవేటు కళాశాలలకు సూచించింది. ప్రభుత్వం చెల్లించిన వెంటనే వారికి అందజేయాలని మధ్యంతర తీర్పు ద్వారా వెల్లడించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.
ఆందోళనలో తల్లిదండ్రులు
ఈ విద్యా సంవత్సరం ఏప్ సెట్ రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో కోర్టు తీర్పు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఆయా కళాశాలల ఫీజులు భారీగా పెరిగిన నేపథ్యంలో రూ.లక్షల్లో చెల్లించడం పేద కుటుంబాలకు పెనుభారంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో మెరిట్‌ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం
నాడు వైఎస్సార్ హయాంలో తీసుకువచ్చిన ఈ పథకానికి ఒకవేళ బ్రేక్ పడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో రేవంత్ సర్కారు తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బకాయిల చెల్లింపులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అండగా నిలుస్తారా.. లేదా కోర్టు తీర్పు ప్రకారం ముందుకు సాగుతారా అనేది వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి : రాఘవపై ఆప్ గుర్రు.. ఆయ‌న‌కు మైక్ ఇవ్వొద్దంటూ ‘రాజ్య‌స‌భ’ కు అధిష్టానం లేఖ‌!

Mahila reservation | ‘ఆమె’కు అందలం దక్కేనా.. రానున్న ఎన్నికల్లో మహిళా శక్తి కీలకం కానుందా?.. ఎవరికి కలిసొచ్చేనో..!

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా.. జాతీయ పార్టీ పాగా వేస్తుందా….లేదా ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయా.. మహిళా శక్తి ప్రభావం ఎవరికి కలిసివస్తుంది.. డీలిమిటేషన్ సన్నాహాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో..
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆయా పార్టీలు ఇప్పటికే అంతర్గతంగా ఫోకస్ కూడా పెంచినట్లు తెలుస్తుంది. జాతీయ పార్టీలతో పాటు కొత్త పార్టీ దిశగా పావులు కదుపుతున్న కవిత కూడా దీనిపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. స్వయంగా ఆమె అధ్యక్షురాలుగా పార్టీ రూపుదిద్దుకుంటున్న తరుణంలో మహిళా ప్రాధాన్యం కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది.

కవితకు ఢిల్లీ వేదికగా పోరాటం కలిసొచ్చేనా
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కవిత మూడేళ్ల క్రితం ఢిల్లీ వేదికగా ఆందోళనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షతోపాటు బిల్లుకు ఏకాభిప్రాయం కోసం దేశవ్యాప్తంగా 47 రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాశారు. ఈ క్రమంలో ‘నారీ శక్తి వందన్ అదినియమ్’ పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఇటీవల ఆమోదించింది. వచ్చే ఎన్నికల్లో దీనిని అమలు చేసే దిశగా కేంద్రం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : తండ్రిని ఫాలో అవుతున్న తనయ.. పార్టీ విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తున్న కవిత

స్త్రీ శక్తి కీలకం కానుందా..
రాష్ట్ర జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలు రానున్న ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు చాలా పార్టీలు ఈ అంశాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ రిజర్వేషన్ అమలు జరిగితే తప్పనిసరిగా కోటా ప్రకారం కేటాయించాల్సిందే. జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ దీనిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నప్పటికీ ప్రధానంగా మహిళా అధ్యక్షురాలు గా రానున్న కవిత పార్టీకి కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు.

kavitha party| తండ్రిని ఫాలో అవుతున్న తనయ.. పార్టీ విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తున్న కవిత

కవిత కొత్త పార్టీ ముహూర్తం ఈ నెల 25న ఖరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు విధివిధానాల ఖరారుపై ఆమె పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మేధావులు, ఆయా రంగాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి అన్ని వర్గాలను కలుపుకొని పోయే దిశగా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
వరుస సమావేశాలు
గతంలో టిఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా కేసీఆర్ ఆయా రంగాల ప్రముఖులు, నిపుణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లుగానే జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా అలాగే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పార్టీ విధి విధానాలు, చేరికలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా నెరవేరని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సమస్యలు, మెజారిటీ వర్గాల శ్రేయస్సు వంటి వాటిపై ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. విద్య, వైద్యం, నిరుద్యోగం, నీటి పారుదల వంటి కీలక అంశాలతో పాటు సబ్బండ వర్గాలకు మేలు జరిగే కార్యక్రమాల రూపకల్పనపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే చేరికల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రానున్న జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పాటు తనకు పట్టున్న ఉత్తర తెలంగాణలో కీలక ప్రాంతాలపై గురి పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది.
యువత, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ల పై ఫోకస్
యువతరం తో పాటు ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులను పార్టీలో కి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మిగతా పార్టీల కంటే భిన్నంగా మహిళలకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది
ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్
నవమి రోజున ప్రకటించిన విధంగా ప్రజల నుంచి కూడా కవిత ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. తన తండ్రి మాదిరిగా పార్టీ విషయంలో పూర్తిస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : తెలం’గానం’.. కలిసొచ్చేనా ‘జాగృతి’కి జనం హారతిచ్చేనా?

AAP is angry with Raghava |రాఘవపై ఆప్ గుర్రు.. ఆయ‌న‌కు మైక్ ఇవ్వొద్దంటూ ‘రాజ్య‌స‌భ’ కు అధిష్టానం లేఖ‌!

రాజ్య‌స‌భలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి సామాన్యుని గొంతుక‌గా నిలిచిన ఆప్‌ ఎంపీ రాఘ‌వ చ‌డ్డా ఇటీవ‌ల వార్త‌ల్లోకెక్కి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆయ‌న‌పై సొంత పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ లైన్ కాకుండా సొంత ఇమేజ్ కోసం వ్య‌వ‌హరిస్తున్న‌ట్లుగా భావించిన అధిష్టానం అత‌డిపై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ ప‌ద‌విని తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు అత‌డికి స‌భ‌లో పార్టీ త‌ర‌ఫున మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని చైర్మ‌న్‌కు పంపిన లేఖ‌లో పేర్కొంది. ఆ స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిఠ‌ల్‌ను నియ‌మించాల‌ని కోరింది.
అస‌లేమైంది..
ఆప్ ప్రారంభం నుంచి కేజ్రీవాల్ వెంట న‌డిచారు రాహుల్‌. 2012 నుంచి క్రీయాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఢిల్లీ ఎమ్మెల్యేగానూ ప‌నిచేశారు. తాజాగా పంజాబ్ రాష్ట్ర కో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూనే అక్క‌డి నుంచి రాజ్య‌స‌భ ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తు న్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్టు, జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత రాహుల్ పార్టీ కార్య‌కలాపాల్లో అంటీముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం కొంత ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీ లైన్ కాకుండా సొంతంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స‌భ‌లో ప్ర‌స్తావించ‌డం వంటి అంశాల‌ను అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌నపై వేటుకు రంగం సిద్ధం చేసిన‌ట్లుగా సమాచారం. ఇందులో భాగంగా తొలుత ఫ్లోర్ లీడ‌ర్‌గా తొల‌గింపు అంశం తెర‌పైకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది.
వేటు ప‌డితే రాహుల్ అడుగులు ఎటువైపు
ఒక‌వేళ పార్టీ అత‌డిపై వేటు వేస్తే అత‌డి అడుగులు ఎటువైపు ఉంటాయ‌నేది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. కొత్త పార్టీ పెడ‌తారా.. లేదా జాతీయ పార్టీల వైపు వెళ‌త‌రా అనేది ప్ర‌స్త‌తం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.
ఓడిపోలేదు..: రాహుల్ చ‌డ్డా
పార్టీ త‌న‌పై తీసుకున్న చ‌ర్య‌ల నేప‌థ్యంలో రాహుల్ చ‌డ్డా తాజాగా స్పందించారు. తాను ప్ర‌జ‌ల మ‌నిషిని.. వారి స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌డం త‌ప్పేంట‌ని.. త‌న గొంతు ఎందుకు నొక్క‌తున్నార‌ని పార్టీ అధిష్టానాన్ని ఆయ‌న మెసేజ్ ద్వారా ప్ర‌శ్నించారు. తన మౌనం ఓట‌మి కాదంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తాను ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి : పార్లమెంటులో ‘సామాన్య’ గొంతుక.. రాఘవ

oracle dangerbells| డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఒరాకిల్ ! టేకిల్లో గుబులు రేపుతున్న మెయిల్స్

0

oracle dangerbells| నిన్నటిదాకా సాఫ్ట్వేర్ కొలువంటే ఓ క్రేజ్. ఆరంకెల ప్యాకేజీలు అందరినీ ఆలోచింపజేసేవి. ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పటికే ఒరాకిల్ లే-ఆఫ్ ప్రకటించి 30 వేల ఉద్యోగులను ఇంటి బాట పట్టించింది. త్వరలో మరికొందరు కూడా ఉంటారని డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇది ఒక్కటే కాదు.. మరిన్ని కంపెనీలు ఇదే బాట పడుతున్నట్లుగా తెలుస్తుంది.
టేకిల్లో గుబులు
ఇంజినీరింగ్ పూర్తి కాగానే క్యాంపస్ కొలువులు కొట్టిన యువత మంచి ప్యాకేజీలతో భవితకు బంగారు బాటలు వేసుకున్నారు. పెళ్లిళ్లు కాగానే సిటీలో సొంతిల్లు..కారు.. వంటివి కామన్ గా మారాయి. వేతనానికి తగ్గట్లు ఈఎంఐల ఖాతాలో చేరారు. పిల్లలకు మంచి విద్య అందిస్తున్నారు. సీన్ కట్ చేస్తే.. ఏఐ రాకతో పలు కంపెనీలు లే ఆఫ్ బాట పట్టాయి. ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం ఒరాకిల్ 30 వేల మందిని తొలగించింది. ఇందులో భారతీయులు 12వేల మంది వరకు ఉన్నారు.త్వరలో మరికొందరికి కూడా ఉధ్వంసం ఉంటుందని మెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపుతుంది. ఉన్నఫలంగా కొలువులు పోవడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తం అవుతుండగా.. ఉన్నవారిలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వెంటాడుతుంది. మిగతా కంపెనీల పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో ప్రత్యామ్నాయం పై దృష్టి సారిస్తున్నారు.
ఐటీ రంగం బెంబేలు
దాదాపు 15 ఏళ్ల సీనియర్లను సైతం ప్యాకేజీలు ఇచ్చి వదులుకుంటుండడంతో ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఆందోళన కనిపిస్తుంది. ఓరాకిల్ తో మొదలైన ఈ ముప్పు ఎక్కడికి దారితీస్తుందో అనే చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న 60 లక్షల ఉద్యోగుల్లో వాట్ నెక్స్ట్ అనే ఆలోచన వినిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎన్ని పొట్టలు కొడుతుందో వేచి చూడాల్సిందే మరి.

ఇది కూడా చ‌ద‌వండి : పని లేకుంటే జీతం తీసుకోలేను.. రాజీనామా ఆమోదించండి.. రాష్ట్రపతికి ఓ ఐఏఎస్ నివేదన!