Tuesday, June 23, 2026

Chiranjeevi | మెగాస్టార్‌ను క‌లిసిన బీజేపీ చీఫ్‌.. చిరు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారా..?

Chiranjeevi | మెగాస్టార్ మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా.. బీజేపీ నుంచి ఏమైనా ఆహ్వానం అందిందా.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు అనుమానాల‌కు తావిస్తుండ‌గా.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తికరంగా మారాయి.  అయితే క‌మ‌లం పార్టీ మాత్రం అదేం లేద‌ని కొట్టి పారేస్తుంది. 
అర‌గంట పాటు చ‌ర్చ‌..
తెలంగాణ బీజేపీ చీఫ్‌ రామచంద్రరావు సోమవారం చిరంజీవిని ఆయ‌న ఇంట్లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు.  కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఇటీవల 12ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ‘విశేష్‌ జన్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పుష్కర కాలంలో కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు సాధించిన విజయాలు, కీలక ఘట్టాలను వివరించే పుస్తకాన్ని చిరంజీవికి  అందజేసిన‌ట్లు రామ‌చంద్ర‌రావు తెలిపారు.  స‌మాజం, సంస్కృతి, దేశ నిర్మాణం, సినీరంగం, సంక్షేమ ప‌థ‌కాలు తదితర అంశాలపై చర్చించినట్లు  పేర్కొన్నారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖుల‌ను క‌ల‌వ‌డంలో భాగంగా మెగాస్టార్‌ను కూడా క‌లిసిన‌ట్లు వివ‌రించారు. ఇందులో ఎలాంటి రాజ‌కీయ చ‌ర్చ లేద‌ని స్ప‌ష్టం చేశారు.  అయితే పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో మాత్రం చిరు మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అనే చ‌ర్చ మొదలైంది.
చిరంజీవి రాజకీయ ప్రస్థానం ..
సామాజిక మార్పు, సమన్యాయం నినాదాలతో చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ (PRP)ని  స్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలను కైవ‌సం చేసుకున్నారు. మెగాస్టార్‌ స్వ‌యంగా రెండు చోట్ల పోటీ చేసి తిరుపతిలో విజ‌యం సాధించారు. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం ఊపందుకున్న స‌మ‌యంలో అనూహ్య, ఆస‌క్తిక‌ర‌ రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో 2011 ఆగస్టులో పీఆర్పీని నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటుతో పాటు కేంద్ర‌ మంత్రి పదవి వ‌రించింది.  2012 అక్టోబర్ నుంచి 2014 మే వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొన‌సాగారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో హ‌స్తం పార్టీ పూర్తిగా బ‌ల‌హీన ప‌డింది. ఈ క్ర‌మంలో వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అప్ప‌టి నుంచి పూర్తిగా సినీరంగానికే ప‌రిమిత‌మ‌య్యారు.  కాగా, చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతుండ‌గా.. కేంద్రంలోని ఎన్డీఏలోనూ కీల‌క భాగ‌స్వామి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో రానున్న రోజుల్లో మెగాస్టార్‌ను బీజేపీలోకి ఆహ్వానించి ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు ఏమైనా అప్ప‌గిస్తారా అనే ఊహాగానాలు ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో వినిపిస్తున్నాయి.

Hot Topics

Related Articles