Elections Results | ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉత్కంఠగా సాగింది. పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లు మార్పు కోరుకోగా.. చిన్న రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలకే జై కొట్టారు. పశ్చిమ బెంగాల్లో కమలం రెపరెపలాడగా.. తమిళనాట విజయ్ విజిల్ మోగింది. కేరళంలో హస్తం హవా సాగింది. పుదుచ్చేరి, అస్సోంలో బీజేపీ ఆధిపత్యాన్ని తిరిగి కొనసాగించింది.
హ్యాట్రిక్ మమత కు నాలుగో *సారీ*
పశ్చిమ బెంగాల్లో మొత్తం 293 స్థానాలకు గాను బీజేపీ(Bjp) 208 స్థానాలు కైవసం చేసుకొని ప్రభంజనం సృష్టించింది. తొలిసారిగా సర్కారు ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. దశాబ్దంన్నర తర్వాత ఇక్కడ టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. హ్యాట్రిక్ సాధించిన మమత బెనర్జికి నాలుగో సారి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. టీఎంసీ (Tmc) ఇక్కడ 79 స్థానాలతో రెండోస్థానానికి పరిమితమైంది. ఇక కాంగ్రెస్ రెండు, లెఫ్ట్ రెండు, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు.
మోగిన విజయ్ విజిల్..
ఇక తమిళనాడులో అనూహ్యంగా విజయ్ పార్టీ టీవీకే సంచలనం సృష్టించింది. మొత్తం 234 స్థానాలకు గాను 107 స్థానాలను కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 118. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఇక్కడ ఫలించినట్లుగా తెలుస్తోంది. ఇక అధికార డీఎంకే కూటమి 74 స్థానాలతో రెండో స్థానంలో నిలువగా..అన్నాడీఎంకే కేవలం53 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కేరళంలో కాంగ్రెస్ పాగా
కేరళంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కాంగ్రెస్ కుటమీకి స్పష్టమైన అధిక్యత లభించింది. మొత్తం 140 స్థానాలకు గాను యూడీఎఫ్ అభ్యర్థులు 102 చోట్ల విజయం సాధించారు. ఇక అధికార ఎల్డీ ఎఫ్ 35 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ అనుబంధ కూటమి మూడు స్థానాలకే పరిమితమైంది. సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ప్రతిపక్ష నేత సతీశన్తో పాటు కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల, సురేశ్ సీఎం రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అస్సోంలో బీజేపీ ప్రభంజనం
అస్సోంలో 126 స్థానాలుండగా బీజేపీ కూటమి 102 స్థానాల్లో విజయం సాధించింది. మరో సారి అధికారంలోకి వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. హిమంత బిశ్వ శర్మ హ్యాట్రిక్ సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ కూటమి కేవలం 21 చోట్లకే పరిమితమైంది. అలాగే ఏఐయూడీఎఫ్ రెండు,ఇతరులు ఒక స్థానం కైవసం చేసుకున్నాయి.
పుదుచ్చెరిలో..
పుదుచ్చేరీలో 30 స్థానాలకు గానూ బీజేపీ, ఎన్నారై కాంగ్రెస్ కూటమి 18 స్థానాలతో అధికారాన్ని తిరిగి ఖాయం చేసుకుంది. కాంగ్రెస్ ఆరు స్థానాలు, టీవీకే మూడు, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు.
ఇది కూడా చదవండి.. ఏడుకొండల బాట పడుతున్నారా.. రిజర్వేషన్ లేకున్నా స్వామి వారిని దర్శించుకోవచ్చు ఇలా




