Gas rate hyke | పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో మరోసారి గ్యాస్ ధర మండింది. గతనెలలో కమర్షియల్ పై బాదిన ఆయిల్ కంపెనీలు తాజాగా డొమెస్టిక్(domestic) ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఆదివారం సిలిండర్పై రూ. 29 పెంచాయి. దీంతో వంటింటి బుడ్డి ధర ప్రస్తుతం రూ. వెయ్యికి చేరువైంది. గడిచిన మూడు నెలల్లో పెంపు ఇది రెండో సారి కావడం గమనార్హం.
మార్చిలో రూ.60.. తాజాగా రూ.29 పెంపు
ఈ ఏడాది మార్చి 7న గృహ వినియోగదారులకు సంబంధించిన గ్యాస్ ధరలను సవరించిన విషయం తెలిసిందే. సిలిండర్పై రూ..60 పెంచిన కేంద్రం తాజాగా మరో రూ.29 పెంచింది. ఈ ధరలు వెంటనే అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పెట్రో ధరల భారంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఈ పెంపు వారిపై మరింత భారం కానుంది. కాగా, మే1న వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.993 పెంచిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా గ్యాస్ ధరల పెంపుతో అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
హైదరాబాద్లో రూ. 994కు పెంపు
హైదరాబాద్(hyderabad) లో ఇప్పటి వరకు గృహ సిలిండర్ ధర (14.2 కిలోల) రూ. 965 ఉండగా.. ప్రస్తుతం రూ.994 చేరింది. ఇక ఢిల్లీలో రూ.913 నుంచి 942కు పెరిగింది. ముంబాయిలో రూ.941.50, చెన్నైలో రూ. 957.50, నోయడాలో రూ. 939.50, బెంగళూర్లో రూ. 915.50, జైపూర్లో రూ. 945.50, లక్నోలో రూ. 979.50, పాట్నాలో రూ. 1,031.50లకు పెరిగాయి. తెలంగాణలో పరిశీలిస్తే.. వరంగల్లో రూ. 1,013, కరీంనగర్లో రూ.1,014 కు చేరువయ్యాయి.
సోషల్ మీడియాలో సెటైర్లు..
గ్యాస్ ధరల పెంపు నేపథ్యంలో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.. మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లడం నమయంటూ కొందరు నెటిజన్లు పేర్కొంటుండగా.. ఎలక్ట్రిక్ వైపు వెళ్లడం మేలని, ఇండెక్షన్ స్టౌలకు గిరాకీ పెరిగిందని మరికొందరు పోస్టింగ్లు పెడుతున్నారు. మున్ముందు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అని ఇంకొందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ప్రైవేట్ స్కూళ్లకు పంపితేనే .. రేషన్, పింఛన్, ఇందిరమ్మ ఇండ్లు కట్!


