Wednesday, April 29, 2026
spot_img

Kcr fires Surya | మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్.. ఎంపీ సూర్యపై మండిప‌డ్డ గులాబీ బాస్‌!

Kcr fires Surya | తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ తెరపైకి వస్తుందా.. ఉద్యమ భావజాలం మళ్లీ రగులుతుందా.. అంటే అవుననే సమాధానాలు చెబుతున్నాయి తాజా పరిస్థితులు. ఇటీవల పార్ల‌మెంట్‌లో ఎంపీ తేజశ్రీ సూర్య వ్యాఖ్యల‌పై బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ స‌మావేశంలో గులాబీ బాస్ ఫైర్ అయిన తీరు ఇందుకు బ‌లం చేకూర్చుతుంది.
దుమారం లేపిన ఎంపీ సూర్య వ్యాఖ్యలు..
ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ తేజశ్రీ సూర్య వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చిన ఆయన తీరుపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెతాయి. బీజేపీ మినహా అన్ని పార్టీలు, తెలంగాణ ప్రజాస్వామిక వాదులు నిరసన గళం వినిపించారు. ఉద్యమాన్ని కించపరిచిన ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) .. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తేజస్వి సూర్య ఒక పెద్ద వెధవ..ఆయన సభలో అనుచితంగా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదు.. రాష్ట్రానికి చెందిన 16 మంది ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటు.. అదే బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు..’అని పేర్కొన్నారు. తెలంగాణపై బీఆర్ఎస్‌కు ఉన్న చిత్తశుద్ధి మరెవరికీ ఉండదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో తెలంగాణ సెంటిమెంట్ మరోసారి తెర మీదకు వచ్చినట్లు అయింది.
బీజేపీ, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ..
ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్‌ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగిన గులాబీ బాస్‌ రానున్న ఎన్నికల్లో తిరిగి పవర్‌లోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఏర్పాటు అంశంపై ఎంపీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో మండిపడ్డారు. బీజేపీతో పాటు కాంగ్రెస్‌ ఎంపీల తీరును తూర్పారా బట్టారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఆవశ్యకతను వివరించారు. ఈ అంశం రానున్న రోజుల్లో రాజకీయ వేడిని పెంచే అవకాశం లేకపోలేదు.
కేంద్రమంత్రి క్షమాపణలు..
ఎంపీ సూర్య వ్యాఖ్యలపై తలెత్తిన దుమారం నేపథ్యంలో అప్రమత్తమైన ఆ పార్టీ నష్ట నివారణపై దృష్టి సారించింది. ఎంపీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు నొచ్చుకుంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. అయితే తేజస్వీ మాత్రం తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ ప్రాంత బీజేపీ నేతలు సైతం ఎంపీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నాయని పేర్కొనడం కొసమెరుపు.

ఇది కూడా చ‌ద‌వండి .. బీజేపీలోకి.. మల్లారెడ్డి?

spot_img

Hot Topics

Related Articles