Petrol shortage | రాష్ట్రంలో పెట్రోల్ (Petrol), డీజిల్ కొరత పుకార్లతో జనం ఇక్కట్లు పడుతున్నారు. అవసరం లేకున్నా ఉదయాన్నే బంకుల బాట పడుతున్నారు. గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఫలితంగా చాలా చోట్ల నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
యుద్ధ ప్రభావం..
పశ్చిమాసియాలో యుద్ధం క్రూడాయిల్ సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు డీలర్లకు క్రెడిట్పై ఇచ్చే విధానానికి స్వస్తి పలికాయి. నగదు ఇచ్చే వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో గతంతో పోల్చితే కొంత సరఫరా తగ్గినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభావం ఉండగా అక్కడ చాలా బంకుల్లో తాజాగా లిమిట్ ప్రకారం ఇంధనం విక్రయిస్తున్న పరిస్థితి. దీంతో తెలంగాణలోని సరిహద్దు జిల్లాల్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సోషల్ మీడియా పుకార్లతో చాలా మంది అవసరం లేకున్నా ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్లో రెండో విడత ఎన్నికలు బుధవారం నిర్వహించారు. పోలింగ్ తర్వాత కేంద్రం చమురు ధరలు పెంచుతుందనే ఊహాగానాలతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే రద్దీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
బంకులు ఎదుట బారులు
రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల బంక్లు ఉదయం నుంచే వినియోగదారులతో బారులు తీరి దర్శనమిస్తున్నాయి. వాహనదారులు గంటల తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని భావిస్తున్న వాహనదారులు అవసరం లేకున్నా పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
సరిపడా నిల్వలున్నాయంటున్నకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..
- మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సరిపడా నిల్వలున్నాయని పేర్కొంటుంది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పందిస్తూ కలెక్టర్లతో ఇంధన సరఫరాపై కమిటీ ఏర్పాటు చేశామని, ప్రతీ నాలుగుగంటలకోసారి చొప్పున సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడ సమస్యలున్నా, ఫిర్యాదుల కోసం 1967లో సంప్రదించాలని సూచించారు.
- కేంద్రమంత్రి కిషన్రెడ్డి తాజాగా ఇంధన సరఫరాపై సమీక్షించిన అనంతరం స్పందిస్తూ.. రాష్ట్రంలో పెట్రో కొరత లేదని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




