Good news | సర్కారు కొలువులకు ఏజ్ లిమిట్ పెరిగిందోచ్..
- Good news | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగ అర్హత వయసును ఎట్టకేలకు పొడిగించింది. 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చని తర్వాత పెంచిన వయసుతో పోల్చితే ఇది రెండు సంవత్సరాలు తక్కువ కావడం గమనార్హం.
నోటిఫికేషన్లపై ఆశలు
రేవంత్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లవుతున్నా నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదు. మరోవైపు వయస్సు సడలింపు గడువు సైతం ఇటీవల ముగిసింది. హస్తం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. ఈ క్రమంలో నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. విద్యావేత్తలు ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఎట్టకేలకు ఉద్యోగ అర్హత వయోపరిమితి పెంపు పై కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నంబర్ 86 ద్వారా 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన 44 ఏళ్ల గడువును కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 46 ఏళ్లకు పెంచిన విషయం విధితమే. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రెండేళ్లు తక్కువగా ఉండడం గమనార్హం. అలాగే ఈ జీవో వర్తింపు కూడా కేవలం ఏడాదిగా పేర్కొనడం కొసమెరుపు.
వయో పరిమితిపై ఏ జీవోలు ఎప్పుడంటే..
– ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయసును 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 19.03.2022న జీవో నంబర్ 42 విడుదల చేసింది.
– రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిమితిని మరో రెండేళ్లు (46ఏళ్లకు) పొడిగిస్తూ జీవో నంబర్ 30ను 08.02. 2024న జారీ చేసింది. ఇది రెండేళ్ల పాటు అమలులో ఉంది. ఆ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఈ క్రమంలో ఇటీవల పొల్యుషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందులో 34 ఏళ్లకు పరిమితం చేయడంపై నిరుద్యోగులు షాక్కు గురయ్యారు. ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి వయసు సడలింపు పై సానుకూలత వ్యక్తం చేసింది. సోమవారం జీవో 86 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ 2 నేపథ్యంలో..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న సందర్భంగా కొత్త జాబ్ నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడినట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి.. ఉద్యోగులకు గుడ్న్యూస్.. వర్క్ ఫ్రం హోం షురూ..