Rtc Strike | ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరింది. గురువారం సైతం బస్సులు రోడ్డెక్కలేదు. మరోవైపు కార్మికులు తమ ఆందోళనలు కొనసాగించారు. ఆయా డిపోలు ధర్నాలతో దద్దరిల్లగా.. నర్సంపేట, నల్గొండ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ క్రమంలో అలర్ట్ అయిన ప్రభుత్వం చర్చలపై దృష్టి సారించింది. కేబినెట్ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుంది. శుక్రవారం కార్మిక జేఏసీతో మరో విడత సమావేశం అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
నర్సంపేట ఘటన కలకలం..
వరంగల్ జిల్లా నర్సంపేట(Narsampet) లో కార్మికులు గురువారం ఉదయం నుంచి ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కోల శంకర్ గౌడ్ అనే కార్మికుడు మధ్యాహ్నం బస్టాండ్ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు నల్గొండలో సమ్మె శిబిరం వద్ద మిర్యాలగూడ డిపో కార్మికుడు వెంకన్న డీజిల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. అక్కడే ఉన్న తోటి కార్మికులు, పోలీసులు సకాలంలో స్పందించి అతడిని కాపాడారు. అలాగే భద్రాచలం డిపోకు చెందిన కార్మికుడు లింగారెడ్డి గడ్డి మంది తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లుగా కార్మికులు చెబుతున్నారు.
అలర్టయిన ప్రభుత్వం
ఈ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయింది. కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించడంతో పాటు సమావేశం పూర్తి కాకముందే సీఎం సూచనతో పలువురు మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం, కోమటిరెడ్డి, రాజనర్సింహ మాట్లాడుతూ, కార్మికులు సంయమనం పాటించాలని, క్షణికావేశ నిర్ణయాలు సరికాదని, తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరారు. ఇది ప్రజా ప్రభుత్వమని డిప్యూటీ సీఎం సమక్షంలో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి తమ వంతు కృష చేస్తామని భరోసా కల్పించారు.
కార్మికులు ఏమంటున్నారు..
మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్నిస్వాగతిస్తున్న కార్మికులు సమస్యల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధి చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమని గొంతెమ్మ కోరికలు కావని.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు మాత్రమే అని అంటున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిశీలించి కాలయాపన చేయకుండా త్వరగా నెరవేర్చాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: మోగిన సమ్మె సైరన్ .. ఆ ప్రగతి చక్రాలు ఏమంటున్నాయ్




