kavitha party | టిక్..టిక్..టిక్.. రోజులు గడిచాయి. గంటలే మిగిలాయి.. సర్వోదయానికి వేళయింది. పిడికిలెత్తే సమయం ఆసన్నమైంది. ఉద్యమ వీరుల మది నిండుగా.. సబ్బండ వర్గాలకు అండగా నిలిచే ఆ జెండా ఇక నింగినంటనుంది. ప్రజా గొంతుక ఇక జన జాగృతిగా రణం చేయనుంది. జై తెలంగాణ అని నినదించనుంది. (క)ష్టాలకు (వి)లపించక (త)రిమేసే కొత్త పార్టీగా శనివారం పురుడుపోసుకోనుంది. మహిళా రాజకీయ శక్తిగా ఆవిర్భవించనుంది.
రేపే కవిత కొత్త పార్టీ..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(kavitha) కొత్త పార్టీకి రేపే నామకరణం. గన్పార్క్ వద్ద అమరవీరులకు సంస్మరణ అనంతరంమునీరాబాద్ వేదికగా నూతన పార్టీ ఆవిర్భవించనుంది. ఆ వెంటనే జెండా, ఎజెండా విడుదల కానుంది. జాగృతి సైన్యం కవాతు నడుమ కవిత తన రాజకీయ భవిష్యత్ ముఖ చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తారు.
జాగృతి నుంచి పార్టీ దాకా ప్రస్థానం..
మలిదశ ఉద్యమ సమయంలో 2006లో అమెరికన్ నుంచి తిరిగి వచ్చిన కవిత అదే ఏడాది తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు. బతుకమ్మతో ఊరురా తిరిగి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో మాత్రం ఓటమి చవిచూశారు. 2020లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2022 లోనూ అక్కడి నుంచే మరోసారి ప్రాతినిధ్యం వహించారు. 2024లో కవిత లిక్కర్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. దాదాపు 5 నెలల పాటు కవిత జైలు జీవితం గడిపారు. 2024 ఆగస్టు 27న బెయిల్ పై విడుదలయ్యారు. 2025 మే లో కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ లీక్ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చాక ” కేసీఆర్ దేవుడే.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి..” అంటూ చేసిన హాట్ కామెంట్స్ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. అప్పటినుంచి కవితకు పార్టీకి మధ్య గ్యాప్ పెరిగింది. 2025 మే 31న తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభించారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులపై ఆమె ధర్నా చేపట్టారు. సెప్టెంబర్ 1న హరీష్ రావు, సంతోష్ రావు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆమెను మరుసటి రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె జాగృతి ద్వారా జనం బాట పట్టారు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెంచారు. ఈనెల 25న కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ సెకండ్ ఇన్నింగ్స్ రేపు షురూ కానుంది.
ఇది కూడా చదవండి : ఆమె అడుగులు.. వ్యూహాత్మకం!




