Good news | రాష్ట్రంలోని నిరుద్యోగులపై ఆ “దేవుడు” ఎట్టకేలకు కరుణ చూపినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత దేవాదాయ శాఖలో 190 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఏప్రిల్ 30, 2026న జీవో ఎంఎస్ 42 ద్వారా ఫైనాన్స్ శాఖ వివరాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం 190 పోస్టులు..
దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గ్రేడ్-1, 2, 3పోస్టుల కోసం 190 ఖాళీలను ప్రకటించింది. జోనల్ విధానంలో రెవెన్యూ/టీఎస్పీఎస్సీ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. వయో పరిమితి ప్రస్తుతం 34 సంవత్సరాలుగా ఉండగా దీనిని ఇది వరకు మాదిరిగా 46 ఏళ్లకు పెంచే అవకాశం లేకపోలేదు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. తదనంతరం పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు..
రాష్ట్రంలో ఏడు జోన్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 190 పోస్టులుండగా.. ఇందులో గ్రేడ్-1: 41, గ్రేడ్-2: 62, గ్రేడ్-3: 87 ఉన్నాయి. జోన్ల వారీగా పరిశీలిస్తే .. కాళేశ్వరం జోన్లో 6, బాసరలో 14, రాజన్న పరిధిలో 7, భద్రాద్రి కొత్తగూడెంలో 20, యాదాద్రి భువనగిరిలో 48, చార్మినర్ జోన్లో 67, జోగులాంబలో 28 పోస్టులున్నాయి.
డిగ్రీ అర్హత…
డిగ్రీ విద్యార్హతగా వీటిని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లో సిలబస్, పరీక్షవిధానం తదితర విషయాలు వెల్లడి కానున్నాయి.
నిరుద్యోగులు అలర్ట్..
చాలా రోజుల విరామం తర్వాత నోటిఫికేషన్కు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న తరుణంలో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అటకెక్కించిన పుస్తకాలను తిరిగి స్టడీ చైర్పై చేరుస్తున్నారు. పరీక్షలో రెండు పేపర్లు (ఒకటి జనరల్ స్టడీస్, రెండోది ఎండోమెంట్ సంబంధిత అంశాలు) ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.నోటిఫికేషన్ వచ్చే వరకు జీఎస్పై దృష్టి సారించాలని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. 46 నుంచి 34.. ! తగ్గిన వయోపరిమితిపై నిరుద్యోగుల్లో మండిపాటు




