Revnath, Kcr | రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు ప్రధాన పార్టీల నేతల డైలాగ్స్ పాలిటిక్స్ ను హీటెక్కించాయి. కాళేశ్వరం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) బీఆర్ఎస్పై విరుచుకుపడగా.. జగిత్యాల సభలో కేసీఆర్ (Kcr) కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు. ఒకే రోజు రెండు సభల్లో సీఎం, మాజీ సీఎం మాటల తూటాలు పేల్చారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని గులాబీ బాస్ అంటే.. ప్రతి పక్షం కూడా దక్కకుండా చేస్తానని రేవంత్ స్పష్టం చేయడం గమనార్హం.
సీఎం రేవంత్ ఇలా..
‘తోడెలు బయటకెళ్లింది.. ఆ గుండెలదరాలే.. ‘ అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి స్పీచ్ మొదలుపెట్టిన సీఎం రేవంత్.. జీవన్రెడ్డి తాజా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ ప్రజా పాలన ఎందుకు పోవాలె.. పామ్ హౌస్ల పండుకున్న పాపాలభైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలే..’ అంటూ కాంగ్రెస్ నుంచి పోయిన జీవన్రెడ్డిని తనదైన శైలిలో అరుసుకున్నారు. ‘ నువ్వు.. ఓ పెద్ద మనిషివా ‘ అంటూ ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ను ప్రస్తావిస్తూ.. ‘ కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్ల గోదారిలో కలిపితివి.. కడుపు మండుతంది.. ఆటవిక రాజ్యమైతే అడవిలో చెట్టుకు ఉరేసేటోళ్లు.. నిజాం సర్కారైతే ఊర్ల కోదండమేసి.. లాగుల తొండలిడిసేటోళ్లు..’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘ వచ్చే ఎన్నికల్లో నీకున్న ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకుంటే నా పేరు మార్చకుంట బిడ్డ.. 2023లో నిన్ను ఓడగొట్టిన.. 2024నీకు గుండు సున్న ఇచ్చిన.. సర్పంచ్ ఎన్నికల్లో పాతరేసిన.. మున్సిపల్ ఎన్నికల్లో ఉక్కు పాతరేసిన.. జూబ్లిహిల్స్, కంటోన్మెంట్లో నీకు ఘోరి కట్టిన.. వచ్చేసారి ఆ ఘోరి మీద మా కార్యకర్తలు కాంగ్రెస్ జెండా ఎగరేస్తరు.. ఇదే నా సవాల్..’ అంటూ స్పష్టం చేసిన సీఎం.. ‘ ఇగ చూసుకుందాం కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో నువ్వా..నేనా .. ప్రజా పాలనా.. పాపాల బైరవుడా..’ అంటూ సవాల్ విసిరారు. ‘ ఎన్నికలెప్పుడొచ్చినా రాసిపెట్టుకో.. జగిత్యాలలో నిన్ను రాజకీయంగా వంద మీటర్ల గోతి తీసి పాతరేసే కార్యక్రమం మా కార్తకర్తలు తీసుకుంటరు..’ అని తీవ్రంగా విమర్శించారు. ‘ఏడాది ఓపిక పట్టలేక శత్రువుతో చేతులు కలిపిన జీవన్రెడ్డికి సిగ్గుండాలే ..’అంటూ ఘాటుగా స్పందించారు.
కేసీఆర్ ఇలా..
‘ ఆరు నూరైనా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. అప్పుడు జీవన్రెడ్డి మంచి పదవిలో ఉంటారని..’ ప్రసంగం షురూ చేసిన గులాబీ బాస్ తెలంగాణ ఉద్యమ ప్రస్తానాన్ని తనదైన శైలిలో వివరించారు. కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను ఎండగట్టారు. ‘ గతంలో ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ నీళ్లిచ్చినమ్.. ఇప్పడేం రోగం పుట్టింది.. ఇప్పుడెందుకు ఆ పథకం కుంటుతంది.. ఎందుకు నీళ్లు వస్తలేవు.. దీనికి చేయాల్సింది ఒక్కటే.. లాగులు పలిగేదాకా సంపాలె.. కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి.. ఐదేండ్లు నడిచింది గదా.. మరి మీకేం బీమారొచ్చంది.. నాకర్థం కాదు.. ఇంతింత మాటలు.. అడ్డం.. పొడుగు మాట్లాడొత్తదా.. పొద్దున్లేత్తే కేసీఆర్ చావాలె.. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా.. అనుకుంటున్నావేమో.. పిల్లి శాపానికి ఉట్టి తెగుతదా.. ఈ వెదవలు కేసీఆర్ సావాలంటే కేసీఆర్ సత్తడా..’ అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ‘బోడగుండు హైడ్రాను తెచ్చి ఆగమాగం చేస్తుండ్రు.. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దానిని ఎత్తి అవతల పడేస్త..’ అంటూ తన మార్కు పంచులతో శ్రేణుల్లో జోష్ పెంచారు గులాబీ బాస్.
ఇది కూడా చదవండి : రేవంత్ కాంగ్రెస్..




