MLA Mallareddy Family | ‘పాలమ్మిన.. పూలమ్మిన.. బోర్వెల్ నడిపిచ్చిన.. కష్టపడ్డ.. కాలేజీలు పెట్టిన.. సక్సెస్ అయిన..’ ఈ డైలాగ్ ఎవరిదో ఇప్పటికే మీకు గుర్తుకొచ్చుంటుంది. ఆయనే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈయన బీఆర్ఎస్ (BRS) లో మాస్ లీడర్గా గుర్తింపు పొందారు. గతంలో కేసీఆర్ కేబినేట్లో కార్మికశాఖ మంత్రిగానూ పనిచేశారు. గులాబీ బాస్కు విధేయుడిగా పేరున్న ఈయన ప్రస్తుతం కుటుంబంతో సహా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా.. అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి.
కమలం పార్టీ టచ్లోకి మల్లన్న కుటుంబం..
తన విద్యా సంస్థలకు సంబంధించిన అంశంపై మల్లారెడ్డి ఇటీవల కుటుంబంతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఆయన కోడలు ప్రీతిరెడ్డి తాజాగా రాష్ట్ర బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించి పార్టీ కీలక నేతలతో సమావేశం కావడం ఊహాగానాలకు తెరతీసింది. ‘కమలం’ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావుతోనూ ఆమె రెండు రోజుల క్రితం బేటీ కావడం మరింత బలం చేకూర్చినట్లయింది. కాగా, డిజిటల్ ఇండియా కోసమే అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్లుగా ఆమె వివరించారు. తాను బీజేపీలో చేరడం లేదని, ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.
కొట్టి పారేస్తున్న మల్లారెడ్డి
బీజేపీలో చేరికకు సంబంధించి మల్లారెడ్డి కొట్టిపారేస్తున్నప్పటికీ వరుసగా ఆయన కుటుంబ సభ్యులు కషాయ పార్టీ నేతలతో సమావేశమవుతుండడం ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరి ఎంపీ స్థానంతో పాటు మరో నాలుగు అసెంబ్లీ స్థానాలను ప్రతిపాదించగా బీజేపీ అధిష్టానం కూడా సూచనప్రాయంగా అంగీకరించినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.
ఈటలకు చెక్ పెట్టేందుకేనా..?
ప్రస్తుతం మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఎంపీగా ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. పార్టీలోని ఓవర్గం ఆయనకు చెక్ పెట్టేందుకే ఈ స్థానం మల్లారెడ్డి కుటుంబానికి హామీ ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు.
ఇది కూడా చదవండి .. జనాభా లెక్కలో.. మన పేరు సొంతంగా నమోదు చేసుకోవచ్చండోయ్..




