Sunday, April 5, 2026
spot_img

Fee reimbursement |వారికి షాక్‌..! ఉన్నత విద్య ఇక అందని ద్రాక్షేనా.. కోర్టు తీర్పు ఏంటి.. సర్కారు వైఖరి ఎలా ఉండబోతుంది..?

పేద విద్యార్థులకు ఇక ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందా..అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. రూ.కోట్లలో ఫీజు బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు తాజాగా హైకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో న్యాయస్థాన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఫీజు రీయీంబర్స్‌మెంట్‌ పథకం..
పేద, నిరుపేద వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల సంక్షేమం కోసం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫీజు రీయీంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. కొత్త రాష్ట్రం ఏర్పడినా.. ప్రభుత్వాలు మారినా ఈ పథకం అమలు మాత్రం కొనసాగుతోంది. అయితే బకాయిలు మాత్రం ఏటా రూ.కోట్లలో పేరుకుపోతుండడం గమనార్హం. దీంతో ఆయా కళాశాలలు ఏటా ఆందోళనలకు దిగడం.. ప్రభుత్వం నామమాత్రంగా నిధులు విడుదల చేయడం షరా మామూలుగా మారింది.
హైకోర్టును ఆశ్రయించిన కాలేజీలు
బకాయిల చెల్లింపు విషయంలో టోకెన్లు జారీ చేసిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్‌ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులకు వేతనాలు సైతం చెల్లించలేకపోతున్నామని, కళాశాలలు నడిపే పరిస్థితి లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాయి. విచారణ జరిపిన కోర్టు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి (2026-27 విద్యా సంవత్సరం) ఫీజు వసూలు చేసుకోవచ్చని ప్రైవేటు కళాశాలలకు సూచించింది. ప్రభుత్వం చెల్లించిన వెంటనే వారికి అందజేయాలని మధ్యంతర తీర్పు ద్వారా వెల్లడించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.
ఆందోళనలో తల్లిదండ్రులు
ఈ విద్యా సంవత్సరం ఏప్ సెట్ రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో కోర్టు తీర్పు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఆయా కళాశాలల ఫీజులు భారీగా పెరిగిన నేపథ్యంలో రూ.లక్షల్లో చెల్లించడం పేద కుటుంబాలకు పెనుభారంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో మెరిట్‌ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం
నాడు వైఎస్సార్ హయాంలో తీసుకువచ్చిన ఈ పథకానికి ఒకవేళ బ్రేక్ పడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో రేవంత్ సర్కారు తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బకాయిల చెల్లింపులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అండగా నిలుస్తారా.. లేదా కోర్టు తీర్పు ప్రకారం ముందుకు సాగుతారా అనేది వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి : రాఘవపై ఆప్ గుర్రు.. ఆయ‌న‌కు మైక్ ఇవ్వొద్దంటూ ‘రాజ్య‌స‌భ’ కు అధిష్టానం లేఖ‌!

spot_img

Hot Topics

Related Articles