ఈపీఎఫ్ కనీస పింఛన్ పెరగనుందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఊరటనిచ్చే అంశమిది. రిటైర్మెంట్ తర్వాత చందాదారులు పొందే పింఛన్కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.వెయ్యి కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఈ మేరకు నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది.
ఇప్పటి వరకు ఉన్న కనీస పింఛన్ సరిపోవడం లేదంటూ, పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలంటూ పెన్షనర్లు ఏళ్లుగా ఆందోళన చేపడుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా దేశ రాజదానిలో ఇటీవల మూడు రోజుల పాటు ధర్నా సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది. మినిమమ్ పింఛన్పై పెన్షనర్ల నుంచి వినతులు వచ్చినట్లుగా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇది ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995ని పునఃసమీక్షించాలని సూచించింది. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1,000గా ఉండగా.. దీనిని 2014లో చివరిసారిగా సవరించారు. తాజాగా రూ.7500లకు పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. దీనిపై కేంద్రం త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2026 బడ్జెట్లో లేదంటే రాబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశాల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చు.
ప్రభుత్వ పరిశీలనలో..
పింఛన్ పెంపుపై ప్రభుత్వం పరిశీలనలో మూడు అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో రూ.3,000, రూ.5,000 లేదా రూ.7,500కు పెంచాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.



