ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎప్సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే నెల 4, 5 తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షలు 9, 10, 11తేదీల్లో నిర్వహించనున్నారు. హైదరాబాదులోని జేఎన్టీయాలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. దరఖాస్తు, పరీక్ష నిర్వహణలో ఈసారి పలు మార్పులు చేపట్టినట్లు వివరించారు.
పరీక్ష రాసిన వెంటనే మార్కులు..
విద్యార్థులు ఇక పరీక్ష పూర్తయిన వెంటనే తమకు ఎన్ని మార్కులు వస్తాయనేది వెంటనే తెలిసిపోతుంది. ఫలితాల ప్రకటన వరకు వేచి ఉండాల్సిన పని లేదు. పరీక్ష పూర్తవగానే కంప్యూటర్ స్ర్కీన్పై వారికి వచ్చే మార్కులు( ప్రైమరీకి ప్రకారం) డిస్ ప్లే అవుతాయి. అంతేకాక, ఆ మార్కులకు ర్యాంకు ఎంత అనేది గత ఫలితాల ఆధారంగా జాబితా కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈసారి మొబైల్ లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
తప్పు దొర్లితే ఫోన్ చేసి అలర్ట్ చేస్తారు
దరఖాస్తు సమయంలో ఎంపీసీ బైపీసీ వంటి గ్రూప్ విషయంలో ఎక్కడైనా తప్పు దొర్లితే వెంటనే ఏప్ సెట్ నిర్వాహకుల నుంచి ఫోన్ కాల్ రానుంది. ఈ విధానాన్ని కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. దరఖాస్తు ప్రక్రియలో తప్పుల నివారణకు అవకాశం ఏర్పడనుంది.




