Borders no change | రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఇప్పట్లో లేనట్లే. అలాగే జిల్లాల పునర్విభజన కూడా ఉండకపోవచ్చు. మరో ఏడాది వరకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఈ విషయాన్ని స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
2027మార్చి చివరి వరకు..
వచ్చే ఏడాది మార్చి 31 వరకు జిల్లా, మండల, గ్రామ సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని కేంద్రం పేర్కొన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో బోథ్ రెవెన్యూ డివిజన్ అంశాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ప్రస్తుతం జన గణన సర్వే నిర్వహిస్తున్న తరుణంలో అది పూర్తయ్యేంతవరకు చేసే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది.
పునర్విభజన నేపథ్యంలో
మరోవైపు జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) కసరత్తు చేపడుతున్న తరుణంలో సరిహద్దుల మార్పులు చేపట్టకూడదని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది.
అప్పటివరకు ఆగాల్సిందే
గతంలో అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాలను శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన చేపట్టడం అవసరమని అసెంబ్లీలో మంత్రి పొంగులేటి(ponguleti) గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. కొత్త జిల్లాలతో ఏర్పాటుతో పాటు కొన్నిచోట్ల మళ్లీ కలపాలని విన్నపాలు వెల్లువెత్తాయి. ఆందోళనలు కూడా మొదలయ్యాయి. జిల్లా, మండల సాధన సమితిలు ఒకసారిగా తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా హుజురాబాద్ ను కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా హనుమకొండ, వరంగల్ ను తిరిగి ఒకే జిల్లాగా మార్చాలని, సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిన హుస్నాబాద్ ను తిరిగి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని, ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలంటూ స్థానికుల నుంచి ఆకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జిల్లాలు చాలావరకు తగ్గుతాయని, కొన్ని సరిహద్దులు మారుతాయని ఊహాగానాలు వినిపించాయి. పార్లమెంటు స్థానాల ఆధారంగా పునర్విభజన జరిగే అవకాశాలు ఉంటాయని రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అయితే తాజాగా సీఎం ప్రకటన నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు ఆగల్సిందే అని స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి : సీట్లు పెరుగుతున్నాయోచ్.. ఎమ్మెల్యే,ఎంపీ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్..!




