Thursday, April 9, 2026
spot_img

Telangana politics | స‌గం అయినట్లే.. ఇక పార్టీల చూపు.. ఎన్నికల వైపు!

Telangana politics | కాంగ్రెస్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు సమీపిస్తుంది. ఇంకో స‌గం పిరియడే మిగిలింది. ఆయా పార్టీలు అప్పుడే ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెడుతున్నాయి. అధికార పార్టీ హామీల అమ‌లుపై దృష్టి సారిస్తుండ‌గా.. విప‌క్షాలు స‌ర్కారు తీరును ఎండ‌గడుతూ క్షేత్ర స్థాయిపై న‌జ‌ర్ పెంచుతున్నాయి. బ‌లం, బ‌ల‌హీన‌త‌ల‌ను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

  • హామీల అమలుపై హస్తం ఫోకస్..
    కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం విధితమే. ఇందులో కొన్ని అమలు చేయగా .. మరికొన్ని మిగిలాయి. ఓ వైపు వెంటాడుతున్న అప్పులు.. మరోవైపు సంక్షేమ పథకాల అమలు సర్కారు కు కత్తి మీద సాముగా మారాయి. ప్రధానంగా నిరుద్యోగ యువతకు సంబంధించి రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలుపై తర్జన బర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే పింఛన్ పెంపు, మహిళలకు రూ.2,500 నగదు, స్కూటీల పంపిణీ, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి హామీలపై దృష్టి సారించాల్సి ఉంది. మరో ఏడాదిన్నర గడిస్తే ఎన్నికల మూడ్ ఉంటుంది. అప్పుడు చేస్తే మైలేజ్ కన్నా నెగిటివ్ ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు పూర్తికాగానే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసి ఎన్నికల ఎజెండాతో ముందుకు సాగేలా ‘హస్తం’అధిష్టానం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.
  • వ్యూహాలకు పదును పెడుతున్న గులాబీ బాస్
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి వరుసగా రెండుసార్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ ను చేజార్చుకుంది. ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఓటరు నాడి తెలిసిన గులాబీ బాస్ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు. మళ్లీ కేసేఆరే కావాలని జనం నుంచి రావాలన్నదే ఆయన లక్ష్యం. క్రియాశీలకంగా కనిపించకున్నా వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతున్నారు పెద్ద సారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ను టార్గెట్ చేసే పనిలో నిమగ్నమవుతున్నారు.
  • పుంజుకుంటున్న ‘కమలం’
    అసెంబ్లీ ఎన్నికల నుంచి కమలం పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటున్నట్లుగా తెలుస్తుంది. శాసనసభ తో పాటు మండలిలోనూ ఆ పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకుంది. లోక్ సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో సగం సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటుకుంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండాను రెపరెపలాడించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గతంలో ఆ పార్టీకి ఊపు తెచ్చిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్(bandi sanjay) కి తిరిగి రాష్ట్ర పగ్గాలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా ఆ పార్టీ శ్రేణుల్లో టాక్. అయితే నేతల మధ్య సమన్వయ లోపం కాషాయ పార్టీకి కొంత మైనస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • అందరి చూపు కవిత పార్టీ పైనే
    ఈనెల 25న పార్టీ ఆవిర్భావం ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే. విధి విధానాలు.. జెండా, ఎజెండాపై ఆమె కసరత్తు చేస్తున్నారు. ‘తెలంగాణ జాగృతి పార్టీ’గా పేరు బయటకు రాగా ‘టీఆర్ఎస్’ గా కూడా ఉండవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. త్వరలో రానున్న జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటి అసెంబ్లీ ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలన్నది కవిత ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఉన్నాయని, తాము ఇంటి పార్టీగా వస్తున్నట్లుగా జాగృతి అధ్యక్షురాలు తాజాగా ప్రకటించారు. జమిలి ఎన్నికల వరకు మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయనున్న క్రమంలో మహిళా అధ్యక్షురాలుగా వస్తున్న ఈ పార్టీని తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.
  • ఇది కూడా చదవండి అవునండీ.. యుద్ధానికి బ్రేక్.. కండిషన్స్‌ అప్లై!
spot_img

Hot Topics

Related Articles