Wednesday, February 18, 2026
Google search engine
Homeతెలంగాణకరీంనగర్లో బండి వర్సెస్ పొన్నం.. చివరి నిమిషంలో కాంగ్రెస్ కు ట్విస్ట్ ఇచ్చిన బీఆర్ఎస్.. బల్దియాపై...

కరీంనగర్లో బండి వర్సెస్ పొన్నం.. చివరి నిమిషంలో కాంగ్రెస్ కు ట్విస్ట్ ఇచ్చిన బీఆర్ఎస్.. బల్దియాపై రెపరెపలాడిన కాషాయం

కరీంనగర్ కార్పొరేషన్ పీఠం.. క్షణక్షణం ఉత్కంఠ రేపింది. భక్తులకే కాదు రాజకీయ పార్టీలకూ శివరాత్రి రోజున జాగరణ తప్పలేదు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత బీజేపీ అత్యధిక స్థానాలతో మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు సన్నద్ధమైంది. ఈ తరుణంలో తామూ బరిలో ఉన్నామంటూ మంత్రి పొన్నం ఒక్కసారిగా బాంబు పేల్చారు. అప్రమత్తమైన కమలం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అత్యధిక స్థానాల్లో గెలిచిన కాషాయం జెండా బల్దియాపై రెపరెపలాడాల్సిందే అని పట్టుబట్టిన బండి సంజయ్ తన మార్కు చూపారు. రాజకీయ చతురత ప్రదర్శించారు. ఒక దశలో సీఎం కరీంనగర్ పై ఫోకస్ పెంచడంతో అందరి దృష్టి పడింది. రాష్ట్రమంతా ఈ కార్పొరేషన్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ మంత్రులు ఒక్కరోజులోనే ఈక్వేషన్ మార్చిపడేశారు. స్వతంత్రులు, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్ బి సహకారంతో హస్తగతం చేసుకునేందుకు పొలి’టిక్స్’ ప్రదర్శించారు. ఒక దశలో స్వతంత్ర అభ్యర్థిని మేయర్ గా ప్రకటించారు. ఏమైందో ఏమో గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయంపై మళ్లీ వెనక్కి తగ్గి.. కాంగ్రెస్ అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. అర్ధరాత్రి తర్వాత పేరు ప్రకటించనున్నట్లుగా లీకులిచ్చారు. ఈ ఎపిసోడ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన గులాబీ బాస్ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మేయర్ ఎన్నికకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నేతలను ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం తాము ఎవరికీ మద్దతు ఇవ్వమని కారు పార్టీ స్పష్టం చేసింది. ఈ హఠాత్ పరిణామంతో కాంగ్రెస్ కంగుతుంది. బంతి బీజేపీ చేతిలోకి వెళ్లడంతో కమలం పార్టీకే పీఠం ఖాయమైంది. ఎన్నిక ప్రక్రియ లాంచనమైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మేయర్ స్థానం దక్కించుకొని బీజేపీ రికార్డు సృష్టించింది.

- Advertisment -
Google search engine

Most Popular