జై తెలంగాణ.. అని గర్జించిన ఆ ఉద్యమ గొంతుకలు పునరాలోచనలో పడ్డాయి. స్వరాష్ట్ర సాధనతో సంబురపడ్డ ఆ గుండెలకు పుష్కర కాలమైనా ఆశించిన ఆత్మగౌరవం దక్కక అల్లాడుతున్నాయి. పరాయి పాలనలో ఈసడింపులకు గురై.. అవమానాలు ఎదుర్కొన్న ఆ పోరుబిడ్డల త్యాగాలు చరిత్ర కెక్కినా.. పాలకుల మది నుంచి మాత్రం కనుమరుగయ్యాయి. ఆ తల్లుల గర్భశోకం.. ఉద్యమ సిం’దూరమై’ న వీర వనితల ఆవేదన కనురెప్ప దాటగా.. ఇనుప కంచెలను ఛేదించి కటకటాల పాలైన త్యాగాల వారసులు ఎట్టకేలకు మౌనం వీడుతున్నారు. అమరుల ఆశయాలను ప్రశ్నించి ధిక్కార స్వరంతో రక్తబంధాన్ని తెంచుకున్న ఆ పిడికిలితో అడుగులేసేందుకు సిద్ధమవుతున్నారు.
వేదిక సిద్ధం.. తప్పదు యుద్ధం
రాష్ట్రం సిద్దించిన వెంటనే నేరుగా గన్ పార్క్ వెళ్లిన జాగృతి కవిత అమరులకు నివాళులర్పించి.. కుటుంబాలను ఓదార్చిన ఆ ఘట్టం కళ్ల ముందు కదులాడుతూనే ఉంది. తాజాగా అమరుల ఆశయ సాధనకు ఆమె వేసిన ముందడుగు ఉద్యమ నేతలను ఆలోచింపజేస్తోంది. స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని ఇటీవల ఆత్మగౌరవ సభలో ఎలుగెత్తారు. రామ్ జీ గోండు.. కొమురం భీమ్.. దొడ్డి కొమురయ్య , చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడుతూ.. 1969 ఉద్యమ వీరుల పోరాటాన్ని గుర్తు చేశారు. 2001లో కేసీఆర్ సారథ్యంలో మలిదశ లో పొరుబిడ్డల బలిదానాలు మారువలేనివని
పేర్కొన్నారు. అయితే స్వరాష్ట్రంలో అవకాశాలు వచ్చిన వాళ్లే ఉద్యమకారులను అవమానించే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. పరాయి పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేశాం. మన బానిసత్వాన్ని కూడా తెంచుకోవటానికి ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల అజెండాతోనే తమ పార్టీ ముందుకు పోతుందని స్పష్టం చేశారు.
డిమాండ్లు..
* ప్రతీ ఉద్యమకారుడికి నెలకు రూ. 25వేల పెన్షన్ అందించాలి.
* ఉద్యమకారులందరికీ 250 చదరపు అడుగుల ఇంటి స్థలం లేదా ఇళ్లు ఇవ్వాలి.
* రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించాలి.
* 1969, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి.
* ఉద్యమ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి, నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
* ఉద్యమ కాలంలో పెట్టిన అన్ని కేసులు వెనక్కి తీసుకోవాలి.
* ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.


